Friday 19 August 2016

బ్రహ్మదేవుడికి ఆలయపూజావిధానం ఎందుకు లేదు?పరమశివుణ్ణి లింగరూపంలోనే ఎందుకు పూజించాలి?

     హిందూ ధర్మం/సనాతన ధర్మం ఎంత విస్తారంగా ఉన్నా వాటిలో కొన్నిటిని క్రోడీకరించీ, కొన్నింటిని విభజించి వరస ఏర్పాటు చేసీ సమగ్రంగా కొన్నింటిని తను స్వయంగా రచించీ సమగ్రమైన రూపంలోకి తెచ్చిన మహాజ్ఞాని - వేదవ్యాసుడు!"వివినమూర్తి వెతులాట" అనే బ్లాగు ఒకటి ఉంది.ఎవరో పరిచయం చేస్తే వెళ్ళీ చదివాను.ఆయన చాలా విషయాల్ని సేకరించి ఉంచారు.అందులో శ్రీపాద వారు అనుకుంటాను "హిందువులకా?ఐక్యతా?" అని వ్యాసం రాశారు.అందులో శంకరాచార్యులు,మధ్వాచార్యులు,రామానుజాచార్యులు వేదంలో ఉన్న ఒకే భాగాన్ని తీసుకుని తమకి అనుకూలంగా వ్యాఖ్యానించుకుని మూడు విభిన్నమైన ఆలోచనా ధోరణుల్ని పరిచయం చేసినట్టు చెప్పారు. వారు ముగ్గురే కాదు - హిందువులైనా, హైందవేతరులైనా హిందూమతం గురించి వారు సొంతానికి తెలుసుకోవాలన్నా ఇతరులకి చెప్పాలన్నా అధికారకమైనది వ్యాసప్రోక్త సాహిత్యమే!అంతటి జ్ఞానికి కూడా ఆ జ్ఞానం వల్ల అశాంతి ఎక్కువైపోయి భక్తితో భాగవతం రాసుకుని శాంతించాడు!పోతన గారు భాగవతం సొంతంగా ఏమీ రాయలేదు కదా - వారికి తెలియవలసిన దానికన్నా ఎక్కువ తెలిసిన జ్ఞానం గర్వాన్నీ అశాంతినీ పెంచింది, భక్తిని నింపుకున్నప్పుడు అది వినయాన్నీ ఆనందాన్నీ పెంచింది!

     పోతన విరచిత మహాభాగవతం చదువుతుంటే అక్కడక్కడా గీతాశ్లోకాలలోని భావాన్ని పోలిన పద్యాలు ఉంటాయి. ఎందుకంటే, గీతాశాస్త్రాన్ని సకల శాస్త్రాల సంకలనంగా రచించిన వేదవ్యాసుల వారే సంస్కృత భాగవత కర్త కూడా గనక అవే భావాలు ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. మొత్తం సనాతన ధార్మిక సాహిత్యాన్ని ఔపోశన పట్టిన వేదవ్యాసుల వారు సంక్లిష్టమైన సనాతన ధర్మాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొని వచ్చే ఆలోచనతో సనాతన ధార్మిక సాహిత్యంలోని విభిన్నమైన సిద్ధాంతాల్ని ఒకచోటుకు చేర్చి ప్రతికక్షులు కూడా వ్యతిరేకించలేనంత గొప్పగా నిరూపిస్తూ వాటిమధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని కడుచక్కని పోలికలతో వివరిస్తూ అష్టాదశాధ్యాయి అని కొనియాడబడుతున్న గీతాశాస్త్రం రూపంలో తనకు తెలిసిన సమస్తజ్ఞానాన్నీ నిక్షేపించి అందించారు!భక్తి షట్కం,జ్ఞాన షట్కం,కర్మ షట్కం అని ఆరు అధ్యాయాలని మూడు గ్రూపులుగా విడగొడుతూ మళ్ళీ ఏకసూత్రమైన భావజాలంతో ఒక్కటిగా చేర్చి మొత్తం పద్ధెనిమిది అధ్యాయాలలోని ప్రతి శ్లోకాన్నీ ఛందస్సౌందర్యవిలసితంగా రచించటం పనిలేక చెయ్యలేదు, 700 పైచిలుకు శ్లోకాలు అన్నీ గొప్ప ప్రణాళికాబద్ధంగా రచించినవే - ఏ ఒక్క శ్లోకాన్నో ఎత్తి తీసుకుని గీత మొత్తం ఇదే చెబుతున్నది అనటం అజ్ఞానులు మాత్రమే చెయ్యగలిగిన వెర్రిపని!

     సుమారు ఒక లక్ష సంవత్సరాల నుంచి ఎనభై వేల సంవత్సరాల వెనక ఆఫ్రికా ఖండం నుంచి వచ్చి భారత ఉపఖండంలో స్థిరపడిన మానవ సమూహమే ఇక్కడ అసంఖ్యాకంగా పెరిగి చోటుచాలక ఇతర ఖండాలకు వ్యాపించినదని ఆధునిక శాస్త్రీయ పరిశోధకులు నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పారు. ఇప్పుడు మనం సంస్కృతం అంటున్నది క్రీస్తు పూర్వం 4వ శతాబ్దికి చెందిన  పాణిని చేత సంస్కరించబడిన రూపం.అత్యంత ప్రాచీనమైన తొలినాటి సంస్కృతంలో అప్పటికే ఎంతో సాహిత్యం విస్తరించి ఉంది.అందువల్లనే ప్రపంచంలో ఈనాడు ప్రముఖమైన అన్ని భాషల యొక్క మూలరూపాల్లో ఎన్నో సంస్కృత పదాలు కనిపిస్తున్నాయి."అధాతో విశ్వజిజ్ఞాసా అధాతో బ్రహ్మజిజ్ఞాసా!" అన్న తిరుగులేని నమ్మకంతో వారు ఉపాసించిన జ్ఞానం ఎన్నో విశ్వరహస్యాల్ని వారికి తెలియజెప్పింది!విశ్వాన్ని గురించి తెలుసుకోవడం అంటే విశ్వకర్తను గురించి తెలుసుకోవడమే అన్న అభిప్రాయంలో అబద్ధాలు చెప్పకూడదన్న వాస్తవికతతో పాటు దానికి ఒక పవిత్రత కూడా అమరింది.ఎంతో రహస్యమైన విషయాల్ని కూడా సుబోధకంగా తెలియజెప్పడానికి వారు కధా సాహిత్యాన్ని నిర్మించారు.పౌరాణిక కధలలోని చాలా కధలకి మూలం ఖగోళశాస్త్రపు విషయాలే!ఉదాహరణకి దీపావళి పండుగకి సంబంధించిన నరకాసురుడి కధలో నరకుణ్ణి సత్యభామయే ఎందుకు చంపాలి?ఆనాటి క్షితిజం మీద సూర్యోదయ కాలంలో మొదట మేషరాశి కొంతసేపు కనిపించి,తర్వాత కన్యరాశి పైకి ఎదుగుతూ వస్తూ ఉండగా మేషరాశి కిందకి దిగజారుతూ మాయమైపోతుంది.మామూలుగా సాధువైన మేషం, అంటే గొర్రెకి ఒక్కోసారి తీవ్రమైన క్రోధం పుడుతుంది,కొండల్నీ,బండల్నీ అయినా సరే మూర్ఖంగా గుద్దుకుని చచ్చేవరకు ఆగదు!ఆ మూర్ఖత్వమే నరకుడి స్వభావంలో కనిపిస్తుంది.కన్యరాశికి సంకేతంగా సత్యభామ చేత వాణ్ని చంపించే కధలో చదవగానే తెలియని  విశేషం ఇది.రెండూ తెలిసినవాళ్ళు ఎవరయినా విప్పి చెప్తే గానీ అర్ధం కానివాట్ని అక్కడ ఉన్నది కూడా సరిగ్గా అర్ధం చేసుకోలేనివాళ్ళు తమకు తోచిన అర్ధం చెప్పుకుని వెక్కిరించడం కూడా మరొక  రకమైన అజ్ఞానం!జకీర్ నాయక్ గణేశుడి ప్రస్తావన తెచ్చి హిందూమతాన్ని వెక్కిరించడం ఇలాంటి అర్ధపాండిత్యానికి పరాకాష్ఠ.జాలిపడటం తప్ప మనం చెయ్య్గలిగింది లేదు - తెలిసియు తెలియని నరునికి దెల్పను బ్రహ్మకైనను తరమే?


     ఆదినుంచీ సనాతనుల జిజ్ఞాస అవధులు లేని రీతిన సాగింది.జ్ఞానాన్ని ఇతర్ల మీద పెత్తనం చెయ్యడానికి వాడుకోలేదు, ఇతరులశ్రేయస్సును మాత్రమే  వారు కాంక్షించారు గనకనే ఆనాటి వారి ఆవిష్కరణలు ఈనాటికీ ఆదరించబడుతున్నాయి!ఈ విశ్వం గురించి వారికి తెలిసిన విషయాల్ని వారు దేవాలయ నిర్మాణంలో ఉపయోగించారు.దేవాలయ నిర్మాణం అనేది ఇప్పటివాళ్ళు చేస్తున్నట్టు ఎక్కడ బడితే అక్కడ చెయ్యకూడదు.ప్రాచీన కాలంలో నిర్మితమైన ప్రతి ఆలయమూ అయితే గిరిశిఖరం మీదనో లేకుంటే నదీతీరం వెంబడో నిర్మించటం - నిత్యనైమిత్తికాలతో సతమతమయ్యే జనవాసాలకి దూరంగా - జరిగిందనేది గుర్తుంచుకోవాలి.అక్కడి భౌమాయస్కాత శక్తి ప్రసరించే దిశ మరియూ ఆ శక్తిస్థాయి యొక్క ప్రభావం గురించిన అవగాహనతో ఆ శక్తిని మానవాళికి ప్రశాంతతనీ ఆరోగ్యాన్నీ ఐశ్వర్యాన్నీ కలిగంచే విధంగా ఎంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించారు.ఇవ్వాళ కొత్తగా వీధికొకటిగా పుట్టుకొస్తున్న పిచ్చుకగూళ్ళ లాంటి నిర్మాణాలలో ప్రశాంతత లేకపోవటానికి కారణం క్షేత్రపరంగా గానీ జ్ఞానపరంగా గానీ ఆ ప్రత్యేకతలు లేకపోవటమే!


     క్షేత్ర ప్రాధాన్యతని గమనించి ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించబడిన ప్రతి ఆలయంలో మూడు నిర్మాణాలకి అత్యంత ప్రాధాన్యత ఉంది - ముఖద్వారం పైన అంతస్థులుగా ఉండి దూరానికి కూడా ప్రస్ఫుటంగా కనిపించే రాజగోపురం,ఆలయ ఆవరణలో ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఆకాశానికి సాగినట్టు ఉండే ధ్వజస్తంభం,మూలవిరాట్టు కొలువైన గర్భగృహానికి పైన శంఖువు ఆకారంలో ఉండే విమానశిఖరం.అదనంగా ఏవి ఉన్నా లేకపోయినా ఇవి మాత్రం తప్పనిసరిగా ఉండాలి.రాజగోపురంలో ఉన్న ద్వారసముదాయాల్ని దేవతల ప్రవేశం కోసం అని చెబుతారు.కానీ వాస్తవంగా వాటి ఉపయోగం తెలియాలంటే చిన్నప్పటి సైన్సు పుస్తకాల్లో ఒక పెద్ద గాజు బీకరుకి పైనుంచి కిందకి వరసగా కన్నాలు చేసి నీళ్ళు పోస్తే ఆ నీళు ఏ ఎత్తులో ఉన్న కన్నం నుంచి ఎంత దూరానికి చిమ్ముతాయో చెప్పే ఉదాహరణని గుర్తు చేసుకోండి!నదీతీరంలో కడితే వరదల ఉధృతి నుంచీ గిరిశిఖరం మీద కడితే తుఫాను భీబత్సం నుంచీ ఆలయాన్ని కాపాడటం కోసం చేసిన ఏర్పాటు అది.ఇక ధ్వజస్తంభం అనే నిర్మాణం దగ్గిర ఏ జెండానీ ఎగరవెయ్యరు.పూర్తిగా లోహంతో గానీ కలపతో నిర్మించి లోహపు తొడుగును ఏర్పాటు చేసి గానీ నిలబేడతారు.జెండాగుడ్డలా కనబడే లోహపు కడ్డీల అమరిక ఒక్కో ఆలయానికి ఒక్కోలా ఉంటుంది.పైనుంచి చూసే దేవతలు ఈ అలయాన్ని గుర్తించడానికి ఈ ధ్వజస్తంభం ఉపయోగపడుతుంది అని చెబుతారు.కానీ ఆలయాలు విశ్వశక్తిగ్రాహకాలుగా నిర్మించినవి గనక అలాంటి శక్తిపాతం అధికంగా జరిగి ప్రమాదం సంభవించకుండా చేసిన ఏర్పాటు ఇది. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్మించినవి గనకనే ఇంటికన్నా గుడి పదిలం అన్నారు మనవాళ్ళు.ఇక గర్భగృహం పైన ఉండే పిరమిడ్ ఆకారం విశ్వశక్తిని మూలవిరాట్టు మీదకి కంద్రీకరించటానికి పనికొస్తుంది. 

   వీటన్నిటికన్నా మూలవిరాట్టును లక్ష్యలక్షణసమన్వితంగా తీర్చిదిద్ది స్థాపించడం అతి ముఖ్యమైనది.కొన్ని స్వయంవ్యక్తరూపాలకి శిల్పుల అవసరం అంతగా ఉండకపోవచ్చు,కానీ అర్చామూర్తులను చెక్కడం అందరు శిల్పులూ తేలికగా చెయ్యలేరు.లలితాసాహస్రం నుంచి విష్ణుసాహస్రం వరకు ప్రతి నామానికీ ఒక సంపూర్ణమైన మూర్తిమత్వం ఉంటుంది.ఏ నామానికి ఏ మూర్తిని ఏ లక్షణాలతో ఏ రూపంలో ఏ అలంకారాలతో నిర్మించాలి అనెది తంత్రశాస్త్రంలో ఉంటుంది.తంత్రం,సాముద్రికం,జ్యోతిష్యం లాంటి అన్ని విభాగాలలోనూ పాండిత్యం ఉన్నవారు మాత్రమే అర్చామూర్తులని చెక్కగలరు!నిజానికి ఆలయమూర్తులలో ఉండేది దైవం కాదు.అగోచరమైన దైవాన్ని ఎవరూ చూసినవారూ లేరు,చూసినామని చెప్పి వర్ణించనూ లేదు.సనాతనుల కధాసాహిత్యంలో పాత్రల ముఖతా దైవసందర్శనానుభూతిని వర్ణించడం కావ్యమర్యాద ప్రకారం ఆడవాళ్ళ కళ్ళని చేపల్లాగానూ తామరపూరేకుల్లానూ ఉన్నాయనడం లాంటిదే!సనాతన ధార్మిక సంప్రదాయం తరపున ఏ చారిత్రక వ్యక్తీ నిజ జీవితంలో "నేను దేవుణ్ణి చూశాను,ఫలానా విషయం నాకు దేవుడు చెప్పాడు,కాబట్టి మీరంతా దాన్ని నమ్మి తీరాలి" అని ప్రకటించలేదు.సనాతన ధర్మంలోనే కాదు ఇతర మతాల్లో వర్ణించబడిన దైవం కూడా ఒక భావం మాత్రమే!మిగిలిన మతాలలో ఒక దైవపుత్రుడికో ఒక ప్రవక్తకో ప్రత్యేకతని ఆపాదించి అతనికి మాత్రమే కనిపించిన దేవుడు మిగిలినవారికి ఎందుకు కనిపించటం లేదు,ఆ ఒక్క మనిషి చూడగలిగిన దైవాన్ని మిగిలినవారిని చూడనివ్వకపోవటంలో ఉన్న హేతుబద్ధత ఏమిటి అనేది చెప్పకుండా తప్పించుకుంటున్న అశాస్త్రీయతతో పోలిస్తే భారతీయ సంప్రదాయంలోని ఆలయమూర్తికల్పనలో ఎంతో అర్ధం ఉంది!భాషలో ఉన్న ప్రతి పదాన్నీ చిత్రరూపంలోకి తీసుకు రావచ్చు.ఏ లక్షణాల్ని మనం నేర్చుకుని మన ప్రవర్తనలోకి తెచ్చుకుంటే జీవితం ఒడిదుడుకులు లేకుండా సుఖవంతంగా ఉంటుందో ఆ మంచి లక్షణాలకి ప్రతిరూపాలే అర్చామూర్తులు!ఆనందం-విషాదం,క్రోధం-శాంతం,వినయం-గర్వం లాంటి ప్రతిస్పర్ధి ద్వంద్వాలలో ధనాత్మకమైన లక్షణాలను ఒక వైపుకి చేర్చి చూపించడం జరిగితే దైవత్వం,ఋణాత్మకమైన లక్షణాలను అన్నింటినీ ఒక వైపుకి చేర్చితే అసురత్వం - ఇదే దైవాసుర సంపద్విభాగం యొక్క రహస్యం!ఇంకా గట్టి సాక్ష్యం కావాలంటే క్షీరసాగరమధనం కధని గుర్తు చేసుకోండి.లక్ష్మీదేవి పుట్టగానే దేవతలూ దానవులూ అమృతంకోసం మొదలుపెట్టిన పనిని వదిలేసి ఆమె వెంట పడ్డారు, "చవటాయను నేను, వాడికంటే పెద్ద చవటాయను నేను,కోమలాంగీ నన్ను కోరి వరించవే!" అని చొల్లు కార్చుకుంటూ!అయితే, ఆమె పేర్లలో "ఆర్ద్ర" అనే పేరు కూడా ఉంది కాబట్టి జాలిపడి ఆమె కూడా పరకాయించి చూసింది. గంతకి తగ్గ బొంత ఎవడో ఒకణ్ని కట్టుకుంటే పోలా అనుకోకుండా పేరుపేరునా లక్షణాల లిస్టు తిరగేసింది.ఒకడి దగ్గిర జ్ఞానం ఉందనుకుంటే పక్కనే గర్వం ఉంది.ఒకడి దగ్గిర బలం ఉందనుకుంటే పక్కనే క్రూరత్వం ఉంది.పైగా వీళ్ళందరిలోనూ తన వెనకాల ఉన్న సంపద మీద వ్యామోహం వుంది!అంతేకాదు,అసలు పని వొదిలేసి చొల్లు కార్చుకుంటూ తనవెంట పడ్డారు - కాబట్టి వీళ్ళు బుద్ధిమంతులు కానే కారు!ఆఖరుకి అవలక్సణాలు లేకుండా మంచి లక్షణాలు మాత్రమే కుప్పగా పోసినట్టు ఉండి నిశ్చలనిర్మోహనిష్కామసుందరుడైన మహావిష్ణువుని వరించి అతని పేరుకి ముందు శ్రీని చేర్చింది!

     అసలు జ్ఞానం అంటున్నది ఏదో ఒక రూపం గురించిన సమాచారమే కదా!మనకు కనబడుతున్న దాన్ని గురించి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే జ్ఞానోపాసన,అవునా?అలాంటప్పుడు అమూర్తభావం,అభావచేష్ట,అలక్ష్యగమనం అనేవి అర్ధంలేని మాటలు,కాదా!దయానంద సరస్వతి లాంటివారి బ్రహ్మమతం విగ్రహాన్ని ఆరాధించడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తుంది, కానీ వారి మనస్సులో జరిగే ధ్యానానికి ఒక రూపం ఉంటుంది!ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం శక్తి మరియు ద్రవ్యం వేరు వేరు కాదు,అవి రెండు స్థితులు మాత్రమే అంటే నమ్ముతున్నారు కదా,ఎందుకని?అట్లాగే జ్జానం రూపం అనే జంటలు కూడా పరస్పరం సంబంధం ఉన్నవే.ఏ రకమైన జ్ఞానం అయినా ఏదో ఒక రూపం/భావం చుట్టూ అల్లుకుని ఉంటుంది - భావం అనే మాటనే వాడాను కాని అభావం కాదు,గుర్తుంచుకోండి!ప్రతి భావానికీ ఒక నామం,ఒక రూపం ఉంటాయి. సుబ్బారావు అనే పదంలో సుబ్బారావు ఉండడు,కానీ ఆ పదాన్ని చూడగానే వినగానే మీకు తెలిసినవాళ్లలో ఆ పేరుగల వ్యక్తి ఉంటే అతను తప్పకుండా గుర్తుకొస్తాడు.అదీభావ,నామ,రూపాలని ఆశ్రయించుకున్న జ్ఞానం!మీ ప్రమేయం లేకుండా పేరు చూడగానే ఆ మనిషి గుర్తుకొస్తే జ్ఞాపకం,అవసరమై పనిగట్టుకుని  పేరు ద్వారా గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే అది ధ్యానం - ఇంకా అర్ధం కాలేదా?

     ఇంత వివరంగా చెప్పినా అర్ధం కాలేదంటే మీరు ఖచ్చితంగా హేతుబద్ధతతో సంబంధం లేకుండా మొండివాదన చేసే కరుడుగట్టిన అమూర్త్యారాధకులు అయివుంటారు.ధ్యానం కుదురుగా జరగడానికి రూపం యొక్క అవసరం గురించీ ప్రవర్తనని తీర్చిదిద్దే మంచి లక్షణాల్ని అలవర్చుకోవటానికి సాధన యొక్క ప్రాముఖ్యతని గురించీ ఇంతకన్నా విపులంగా నేను చెప్పలేను!మూర్త్యారాధకులు బొమ్మలతో ఆడుకుంటూ నేర్చుకునే స్థాయిలో ఉన్న చిన్నపిల్లలు,మూర్తి అక్కరలేకపోయినా ధ్యానం చెయ్యగలిగిన మేము ఎదిగినవాళ్లం అని డప్పు కొట్టుకునేవారికి ఓక ప్రశ్న వేస్తున్నాను - సాల్వడార్ డాలీ నుంచి మొదలుపెట్టి నైరూప్య చిత్రకారులు ఎంతోమంది గైర్నికా, డాలి అటామికస్, పెర్సిస్టెన్స్ ఆఫ్ మెమొరీ లాంటి కళాఖండాల్ని గీసింది చిన్నపిల్లల కోసమా!మీరు పంతానికి అవునంటే ఈ ఆర్ట్ గ్యాలరీల్లో గోడలకి తగిలించిన బొమ్మల్ని మోరలెత్తి చూస్తూ నచ్చిన బొమ్మని పట్టుబట్టి కోట్లల్లో వేలంపాడి కొనుక్కుంటున్నవాళ్ళు ఏమవుతారు?సాక్షాత్తూ భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పిన గీతలో గానీ ఈ రెంటినీ చర్చిస్తున్న మరెక్కడయినా గానీ అవి రెండూ వేర్వేరు దారులు అని చెప్పారే తప్ప ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ అని చెప్పలేదు!ఇక బహుళదేవతారాధనకి కూడా రుచిభేదం అనే చక్కని మాటని వాడి సమర్ధించేశారు.మా ప్రవక్తగారికీ/దైవపుత్రుడికీ దేవుడు కనబడ్డాడు అంటూనే మళ్ళీ ఆ దేవుడికి ఆకారం లేదనటం,ఆయనగారు తప్ప ఇతరులు ఆ దేవుణ్ణి చూడలేరనటం,చూడటం కాదు చూడాలని అనుకున్నా నరకానికి పోతారనటం - అమూర్త్యారాదాకులకి మల్లే ఇలాంటి శతకోటి గందరగోళాలకి అనంతకోటి ఉపాయాలు వెదకాల్సిన అగత్యం సనాతనులకి లేదు గనక మానవుడు ఇహలోకంలో ప్రశాంతజీవనం సాగించడానికి నేర్చుకోవలసిన ఆదర్శాలకి మూర్తిమత్వాన్ని సాధించి అద్భుతమైన సాంకేతికతని జోడించి ఆలయాల్ని నిర్మించారు.

     ప్రాచీనకాలంలో నిర్మించబడిన ప్రతి ఆలయంలోనూ ఇప్పటివాళ్ళు కూడా సాధించలేని శాస్త్రసాంకేతికసంబంధమైన అద్భుతాలు ఉండటానికి కారణమేమిటి?ఆధునికులు అవి ఎలా సాధించగలిగారో కూడా తెలుసుకోలేకపోతున్నారే!ఎవరు అధికులు?ఎవరు అజ్ఞానులు?ఉదాహరణకి గుడిమల్లం పరశురామేశ్వర లింగం ఆకారం మానవ పురుషాంగాన్ని పోలి ఉంటుంది.సనాతన ధర్మంలోని విశిష్టత ఏమిటో తెలియని వారికి ఇందులో కొంత అసహ్యత కలగవచ్చును,కానీ స్త్రీపుంసయోగోద్భవమైన సృష్టికార్యం ద్వారా ప్రభవించిన వారు తమ జన్మకు కారణమైన వాటిపట్ల ద్వేషాన్ని గానీ అసహ్యాన్ని గానీ ప్రదర్శించటం విజ్ఞత కాదని ఆర్ష సంప్రదాయం చెబుతున్నది.ప్రకృతిలో కానవచ్చే అన్ని జీవజాతులలోనూ సహజంగా ఉన్న లైంగికద్విరూపకత పట్ల అసహ్యం దేనికి?

     ఆదిలో అగ్ని.మిత్ర,వరుణ,పశుపతి,మహామాత వంటి దేవతల్ని వర్ణించిన సనాతనులు తర్వాతి కాలంలో బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులనే త్రిమూర్తులకి అగ్రస్థానం ఇచ్చి తక్కినవారిని దేవతాగణంగా చెప్పి ప్రజలకి ఆధ్యాత్మికపరమైన సహిష్ణుతని అలవాటు చేశారు.బ్రహ్మకు పూజార్హత లేకపోవటానికీ శివునికి మూర్తిపూజ లేకపోవటానికీ భృగుశాపం గురించిన కధ ఒకటి ఉన్నది గానీ అసలైన సాంకేతిక  విషయాలు కొన్ని ఉన్నాయి,అవి తెలుసుకుంటే మానవ జీవితాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి సనాతనులు ఎంత సూక్ష్మంగా ఆలోచించారో అర్ధమవుతుంది. సనాతన ధర్మం ప్రకారం జన్మకు ప్రాధాన్యత లేదు,బ్రతుకు ఎలా గడిచింది అంతం ఎలా జరిగింది అన్నదే ప్రధానం!పూజ అని చెప్పబడే ప్రతి విధానం లోనూ రూపదర్శనం,భావస్మరణం,నామకీర్తనం ఉంటాయి.అందువల్లనే సృష్టికారకుదైన బ్రహ్మను నిత్యమూ స్మరించాల్సిన విధినుంచి తప్పించి స్థితికారకుడూ,లయకారకుడూ అయిన శివకేశవులకి మాత్రమే నిత్యస్మరణయోగ్యతని కల్పించారు.అయితే ఈ శివకేశవులకి సంబంధించి మనం చూస్తున్న అర్చామూర్తులు ఏవీ వారి నిజరూపాలు కావు.ఆ స్వామి యొక్క లక్షణాల్ని రూపంలోకి అనువదించడానికి తంత్రశాస్త్రంలో కొన్ని సాంకేతిక నియమాలు ఉన్నాయి.రెండూ కేశవ రూపాలే అయినా పద్మనాభ మూర్తికీ హిరణ్యగర్భ మూర్తికీ చాలా తేడా ఉంటుంది.అలా తంత్రశాస్త్రంలో చెబ్బబడిన నిర్దేశాలు తెలిసిన శిల్పవేత్తలు మాత్రమే ఆలయ అర్చామూర్తులని శిల్పాలుగా రూపొందించటానికి అర్హులు!ఇందులో స్థితిని సూచించటం తేలికగానే కుదురుతుంది గానీ లయాన్ని దృశ్యరూపంలోకి తీసుకురావటం దాదాపు అసాధ్యం.అదీ గాక మనం చూస్తున్నది లయకారకుణ్ణి అనగానే చూసేవారిలో భక్తికి బదులు భయం కలిగే ప్రమాదం ఉంది!అందుకే శివుడికి లింగరూపాన్ని ప్రత్యామ్నాయంగా చూపించారు.


     ఈ లింగానికీ పురుషాంగానికీ ఏ సంబంధమూ లేదు.కానీ పైకి పొడుచుకొచ్చేలా ఉన్న లింగాకారాన్నీ అభిషేక జలం పోవటానికి అడుగిన ఏర్పాటు చేసిన దొప్పలా ఉన్న పానపట్టాన్నీ ఉన్నది ఉన్నట్టుగా చూసి తాము చూసిందే నిజం తమకి అర్ధమయిందే జ్ఞానం అనుకునే కొందరు అలా భావించి వాటినే ఖాయం చేసేశారు.కానీ ఆ రూపానికి లింగం అని తొలిసారి ప్రతిపాదించిన వారికి శిశ్నం అనే పదం తెలియదా?ఇప్పుడు మనం భావిస్తున్న న్యూనత వారికి లేనప్పుడు ఏకంగా శివశిశ్నం అనే పదాన్ని వాడకుండా శివలింగం అని ఎందుకు వ్యవహరించారు?ఇప్పుడు మనం ఆలయాలలో చూస్తున్న లింగరూపాన్ని ప్రకృతిలో చూడాలంటే పొగరాకుండా నిశ్చలంగా వెలుగుతున్న జ్యోతి యొక్క పైభాగంలో కనిపిస్తుంది!లింగోద్భవ సమయంలో శ్రీమహావిష్ణువుకీ,బ్రహ్మదేవునికీ గోచరించినది ఆదీ అంతమూ తెలియని జ్వాలాస్తంభమే తప్ప శివుని దేహభాగం కాదు.చీకట్లని దహించే అగ్ని రాగద్వేషాల్ని దహించే జ్ఞానానికి చిహ్నం!జఠరాగ్ని అనేది రగులుతున్నంతకాలం మాత్రమే బ్రతికి ఉందే జీవుడు కూడా జ్ఞానరూపుడే - శివోహం!


     సర్వసామాన్యంగా శివకేశవులకి సంబంధించిన ప్రతి ఆలయంలో అర్చామూర్తి అయితే శివరూపంలో గానీ లేకపోతే కేశవరూపంలో గానీ ఉంటుంది.ఒకరు అర్చామూర్తిగా ఉంటే మరొకరు క్షేత్రపాలకులుగా ఉండటం కూడా జరుగుతుంది.కానీ కొన్నిచోట్ల మాత్రం పూజార్హత లేని బ్రహ్మను కూడా కలుపుకుని త్రిమూర్త్యాత్మకమైన మూలవిరాట్టు కొలువై ఉన్న విశిష్టమైన క్షేత్రాలు ఉన్నాయి.కేశవ క్షేత్రాలలో అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి శివ క్షేత్రాలలో గుడిమల్లం పరశురామేశ్వర స్వామి అలాంటి త్రిమూర్త్యాత్మక రూపంలో వెలిసి ఉన్నారు.


     చాలామటుకు ఆలయాలు ప్రశాంతను కోరి ప్రార్ధించటం కొరకే నిర్మించబడినా కొన్ని ఆలయాలలో ప్రత్యేకమైన వాంచితార్ధపూజలూ దోషపరిహారపూజలూ ఉంటాయి.పరిహార పూజలకు తప్పనిసరిగా బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి.ఈ దానం ద్వారా మన దోషాన్ని వారు గ్రహిస్తారు.వాంచితార్ధపూజలలో అశీర్వచనాలు పలికే బ్రాహ్మణులకి వాక్సుద్ధి ఉండాలి.ఇవి జరిపించే వారు ఆధ్యాత్మికంగా శక్తిసంపన్నులైన ఉపాసకులు అయివుండాలి గనక అన్ని ఆలయాలలోనూ వీటిని నిర్వహించటం కుదరదు.ఆయా పూజలు వాటికి ప్రముఖమైనవిగా చెప్పబడుతున్న ఆలయాలకే వెళ్ళి చెయ్యాలి.ఈ ప్రత్యేకపూజల్లో వాటి ప్రాధాన్యతా క్రమాన్ని బట్టి చూడగా వివాహప్రాప్తి.సంతానయోగం,సర్పదోషనివారణ,రాహుకేతుగ్రహపీడ,ఐశ్వర్యప్రాప్తి వంటివి ఉన్నాయి.ఐశ్వర్యప్రాప్తి కోసం పూజలు చెయ్యగానే లాటరీలో లక్షలు వస్తాయనే గ్యారెంటీ ఎవరూ ఇవ్వరు - కోరుకుంటున్నది న్యాయమైన కోరిక,అదీ దేవుణ్ణి కాబట్టి కోరిక నెరవేరుతుందనే నమ్మకం ప్రశాంతమైన మనస్సుతో ప్రయత్నించేలా చేస్తుంది, అంతే!వీటిల్లో ఎక్కడా పరలోకం గురించిన వాగ్దానాలు గానీ బెదిరింపులు గానీ లేకపోవటాన్ని గమనిస్తే సనాతన ధర్మం ఇహలోకపు సౌభాగ్యాల్ని సాధించటానికే పెద్దపీట వేసిందని తెలుస్తుంది.

     వ్యక్తిగతంగా నాకుకూడా పరలోకం గురించిన చింతన వ్యర్ధం అనిపిస్తుంది."కోరు ఇట రాజభోగాల గోటు ఒకడు,ఒకడు పరలోకమందలి సుకము కోరు.అందరానట్టి దానికై ఆశపడక చేతచిక్కిన చిల్లర స్వీకరించు;దూరతీరాల మ్రోగు దుందుభిని వినిన తీరునా ఆశ - ఉవ్విళు లూరినంత!" అన్న అఖండప్రజ్ఞానిధి ఉమర్ ఖయ్యాం చెప్పినది అక్షరసత్యం!ఇక్కడ లేనిది ఎక్కడా లేనిదే!కంటికి కనిపించనిదాన్ని నమ్మడం అనవసరమే, కనిపించినదాన్ని గురించి నిజానిజాలు తెలుసుకుంటే చాలు అనేది సనాతన ధర్మం ఢంకామీద దెబ్బకొట్టి చెప్తున్న సత్యం!ఏది సత్యమైనది అవుతుందో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనది అవుతుందో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!!

26 comments:

  1. Marvelous! Thank you very much for taking the time to research, write and publish. It can't be an easy effort, but it's essential for most of us to know.

    ReplyDelete
  2. ఇప్పటి కుర్రాళ్ళు సోషల్ మీడియాలోనే హల్చల్ చేస్తున్నారు తప్ప తెలుగు బ్లాగుల్ని చూడటం తకువ.ఎప్పుడయినా వచ్చినా వయస్సులో పెద్దవాళ్ళు తమ అనుభవంతో నాలుగు మంచిమాటలు చెప్తారేమో అనే ఆశతోనే వస్తారు.అలాంటి మంచివాళ్ళకి కూడా వీళ్ళ దగ్గిర నేర్చుకోవడానికి ఏమీలేదు అనేలా బ్లాగుల్ని తయారుచేస్తే ఎవరికి నష్టం?లక్కాకుల వారు "దేముడు" అనే పదం కోసం ఆయనే వరసపెట్టి రాసిన పద్యాల్లో ఉదహరించిన జనభాషని అవమానించడం అన్నట్టు ఆవేశపడిపోవటం అవసరమా?మరి ముళ్ళపూడి వెంకటరమణ గారు "ద్యాముడు" అనే వెక్కిరింత పదాన్ని కూడా సృష్టించారు.దాన్ని కూడా నెత్తిమీద పెట్టుకుని వూరేగడమే జనభాషని గౌరవించినట్టు అవుతుందా?అదీగాక శ్యామలీయం ఏది చెప్పినా నేను చెప్పాను గనక చెయ్యాల్సిందే అని మొండిపట్టు కూడా పట్టనప్పుడు ఇంత రాద్ధాంతం దేనికి?జనరలుగా చెప్పానని సమర్ధించుకోలేరు,అందరికీ అన్నీ స్పష్తంగా అర్ధమవుతూనే ఉన్నాయి.ఏ మాటకి ఏమి అర్ధం వస్తుందో ఏ మాటకి కొమ్ములు తగిలించి వాడితే అది ఎవరికి తగలాలని అనుకుంటున్నారో తెలియనంత అమాయకులు ఎవరు ఉన్నారండి ఇక్కడ!

    నాకయితే మనసులో ఒకటి పైకి ఒకటి తరహా ముసుగులో గుద్దులాట అసలు నచ్చదు.ఎదటివాళ్లని తిట్టాలనుకున్నా సరే మొహం మీద ఫెడీమని అనెయ్యటం తప్ప అన్యాపదేశపు విసుర్లు నేనెప్పుడూ చెయ్యను.ఒకవేళ శ్యామలీయం కాదు,వేరొకరు పద్యాలను కొట్టేశారు అని చెప్పాలనుకున్నా తిన్నగా పేరు చెప్పి తిడితే ఎవరు తప్పు పడతారు?

    నన్ను నేను "చిచ్చరపిడుగు" అని చెప్పుకున్నా అది కేవలం సరదాకి మాత్రమే!వాదనలో వ్యతిరేకించినా నీహారికతో సహా ప్రతి ఒక్కరిపట్లా నాకు గౌరవం ఉంది.ఎంత సీరియస్ విషయాన్ని అయినా సరదాగా తీసుకోవడం నాకు అలవాటు.కానీ శ్యామలీయం మీద జరుగుతున్న అన్యాపదేశపు విసుర్ల దాడిని మాత్రం సరదాగా తీసుకోలేకపోతున్నాను.


    ఒక పెద్దాయన తన సొంత నిర్ణయంతో బ్లాగుల నుంచి నిష్క్రమిస్తే వారికి తెలియకుండా ధారావాహికగా నా బ్లాగులో వేస్తాననడం వరకూ వచ్చింది వ్యవహారం.ఇప్పుడు శ్యామలీయం బ్లాగుకు కూడా అదే గతి పట్టిస్తే తెలుగు బ్లాగుల్లో పనికొచ్చే బ్లాగులు ఎన్ని ఉంటాయి?ఇంతకన్న యాగ్రిగేటర్లతో సహా మొత్తం బ్లాగుల్ని మూసెయ్యడం బెస్ట్?!

    P.S:తనవైపునుంచే చూసుకుంటూ తనది కేవలం హాస్యదృష్టీ,చతురతా అని జిలేబీ తనకు తాను మురిసిపోవచ్చు,కానీ జిలేబీ ధోరణి వెకిలితనం స్థాయికి దిగజారింది - పోరంబోకుతనం వరకూ దిగజారకుండా ఆత్మవిమర్శ చేసుకుంటే తప్ప గౌరవనీయతా/విశ్వసనీయతా తిరిగి రావు.

    స్వస్తి!

    ReplyDelete
  3. చాలా బాగా చెప్పారు హరిబాబు.

    ReplyDelete
  4. మీకు తెలీని సబ్జెక్టులు యెమైనా వున్నాయా అస్సలు??

    >>దైవపుత్రుడికీ దేవుడు కనబడ్డాడు అంటూనే మళ్ళీ ఆ దేవుడికి ఆకారం లేదనటం

    దేవుడి ఆకారాన్ని చూసినట్లు బైబిలు లో లేదు. కానీ "మన రూపు చొప్పున నరుని చేయుదము..." అని వుంది, అది నాకెప్పుడూ అర్ధం కాలేదు

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. " మన రూపు చొప్పున నరుని చేయుదము..." అని వుంది, అది నాకెప్పుడూ అర్ధం కాలేదు.

      దేవుడు అంటే మనుషులు కొన్ని భావాలతో దేవుడిని భావిస్తారు. ప్రేమస్పదుడుగా ఉంటాడని,కష్టాలలో ఉన్న వారిని ఆదుకొంటాడని ... ఈ గుణాలు మనుషులతో పాటు జంతువులకు ఉంటాయి. ఉదాహరణకు ఒక జంతువు ఇంకొక వేరే జాతి జంతువుకు ఆహారం ఇవ్వచ్చు. అటువంటి వీడియోలను నెట్ లో చూసే ఉంటారు. ఆ గుణం ప్రేమకు చిహ్ణం. అయితే ఇటువంటి ఎన్నో దైవగుణాలు జంతువులలో మానవులు నిత్యం చూస్తూ ఉన్నా, వాటిని దేవుడిగా భావించడు. మానవులకు దేవుడు అనే పదం వినటం, దేవుడు కూడా మనిషి రుపంలోనే ఊహించుకొంటారు. దాని కారణాలు అనేకం ఒకటి దేవుడు జంతువుల రూపంలో వస్తే మనిషి గుర్తించలేడు కనుక మానవరూపంలో దేవుడు ఉంటాడని కల్పన చేసుకొంటారు.


      ఇది బైబిల్ వాక్యం కనుక, క్రైస్తవ మతంలో మహిళా దేవుళ్ళు లేరు. అందువలన వారు నరుని అని మగదేవుడిగా ఊహిస్తారు.

      Delete
    3. అంతే ఐ వుండవొచ్చు...

      Delete
    4. సరిగ్గా గుర్తు లేదుకానీ, బైబిల్ లో దేవుడు మగవాడిని తన తొడ ఎముక నుండి ఆడవాళ్ళని మరో శరీర భాగంనుండి తయారు చేసినట్టుగా నాచిన్నప్పుడు మాఇంటి దగ్గర నుండే ఛర్చిలో ఫాదర్ ఊదరగొడుతుండేవాడు.

      Delete
  5. "మన రూపు చొప్పున నరుని చేయుదము..." అని వాక్రుచ్చినవారు ఎవరు?

    ReplyDelete
  6. ఆది కాండము లో వుంది, "దేవుడు ఈలాగున అనుకొనెను అని"-- దీనిగురించి కొంత మంది తో చర్చించాను. మీలాగే దేవుడికి రూపం లేనప్పుడు, ఈ మాట ఎందుకు వుంది అని అడిగి చూసాను. సరైనా సమాధానం ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు..

    ReplyDelete
    Replies
    1. అదే మరి!అసలు ప్రవక్తకి గానీ దైవపుత్రుడికి గానీ కనబడినా కనబడకపోయినా "దేవుడు" అని అనగానే ఒక భావం మనసుకి తెలుస్తుంది గదా!ఆ దేవుడు అనే భావం చుట్టూరానే ఆ మతసాహిత్యం అంతా తిరుగుతుంది కదా!అతనికి కొన్ని ఇష్టాలూ అయిష్టాలూ ఉంటాయి గదా!ఆ దేవుడికి ఇష్టమైన పనులు చెయ్యడం గౌరవప్రదం,ఆ దేవుదికి కోపం వచ్చే పనులు చెయ్యదం ప్రమాదం అని చెప్తారు కదా,తర్వాత మెల్లగా రాజుగారు/ఖలీఫా/పోప్ దేవుడితో సమానం అంటారు - ఇదంతా రాజకీయం సార్!

      Delete
    2. మదర్ తెరేసాని దైవదూతని చేసే ప్రహసనం వచ్చే నెల 4 వతారీఖునట, మన కేంద్రమంత్రులు కూడా దానికి హాజరవుతారట. ఈ ప్రహసనం అంతా మనం నాలుగైదేళ్ళనుంచీ చూస్తున్నాం కాబట్టి మనకి ఐడియా ఉంది, కానీ ఇంతకుముందు సెయింటు లని, దైవ కుమారులని కూడా ఇలాగే తయారు చేసేవాళ్ళన్నమాట!

      Delete
  7. మొదట అభినందనలు ద్యాముడిని గురించి చర్చిస్తున్నందుకు. అలా మంచితనపు పరాకాష్ఠకు అదేనండీ దేవుడికి ఎవరి మనసుకు తోచిన పేరు వాళ్ళు పెట్టేసుకుంటారు ఆయన ఏమీ అనడుగా పాపం.
    వ్యాసం మొత్తం సూపర్ అది మీ ఆలోచనా విధానం ప్రతిబింబిస్తోంది.
    లక్ష్మీదేవి పుట్టగానే దేవతలూ దానవులూ అమృతంకోసం మొదలుపెట్టిన పనిని వదిలేసి ఆమె వెంట పడ్డారు, "చవటాయను నేను, వాడికంటే పెద్ద చవటాయను నేను,కోమలాంగీ నన్ను కోరి వరించవే!" అని చొల్లు కార్చుకుంటూ!అయితే, ఆమె పేర్లలో "ఆర్ద్ర" అనే పేరు కూడా ఉందిడి నిశ్చలనిర్మోహనిష్కామసుందరుడైన మహావిష్ణువుని వరించి అతని పేరుకి ముందు శ్రీని చేర్చింది!
    ఇది చుశారూ.... లక్ష్మీ స్వయంవరం.... లక్ష్మి అంటే సంపూర్ణతకు గుర్తు మరి ఆవిడ తనకు తగ్గ వార్ని వరిస్తుంది కదా...
    బ్రహ్మకుమారీ జ్ఞానం ప్రకారం కొన్ని చెప్పాలని ఉంది....
    పురుషుడు అంటే ఆత్మ. పురి + షేతే అనే పదాల కలయిక పురి అంటే శరీరం షేతే అంటే శయనించే లేక విశ్రాంతి తీసుకునే అనే అర్ధాలు ఉన్నాయి కనుక శరీరము + ఆత్మ కలిపితే జీవాత్మ చైతన్యమైన ఆత్మ అంటే చైతన్యత లేని ఆత్మ కూడా ఉంటుందా అంటే ఉంటుంది ఆత్మకు మూడు స్థితులు చెప్పారు ఒకటి జ్యోతిబిందు రూపం, రెండు సూక్ష్మ శరీరం, మూడు స్థూల శరీరంలో ఆత్మ అదే జీవాత్మ. ఒరిజినల్.గా ఆత్మ బిందురూపం. మిగతా రెండూ దానిని ఆధారంచేసుకున్నవి. మనమంతా ఆత్మలం మన మన శరీరాలు తీసుకుని పాత్ర చేస్తున్నాం. మూలరూపం మనది ఆత్మ జ్యోతిర్బిందు రూపం.

    ReplyDelete
  8. ఆత్మ అంటే చైతన్యత లేని ఆత్మ కూడా ఉంటుందా అంటే ఉంటుంది ఆత్మకు మూడు స్థితులు చెప్పారు ఒకటి జ్యోతిబిందు రూపం, రెండు సూక్ష్మ శరీరం, మూడు స్థూల శరీరంలో ఆత్మ అదే జీవాత్మ. ఒరిజినల్.గా ఆత్మ బిందురూపం. మిగతా రెండూ దానిని ఆధారంచేసుకున్నవి. మనమంతా ఆత్మలం మన మన శరీరాలు తీసుకుని పాత్ర చేస్తున్నాం. మూలరూపం మనది ఆత్మ జ్యోతిర్బిందు రూపం. మనం ఈ భూమి ఆకాశం నక్షత్రాలు, సూర్యుడు,చంద్రుడు ఈ కనపడే స్థూలప్రపంచం దాటి సూక్ష్మలోకం (ఈ లోకంలో ఆత్మలు తమ సూక్ష్మ రూపంతో ఉంటాయి, ఇక్కడ మూడు స్టేజిలు ఒక ఇంద్ర ధనుస్సు పూర్తి స్థూలలోకం చుట్టి ఉంటే భూమికి దగ్గరగా ఉన్న సర్కిల్ బ్రహ్మ పురి ఇది ఆకుపచ్చరంగులో చూబించారు పచ్చదనం బ్రతుకుపై ఆశకు గురుతు. దీని పైన సర్కిల్ విష్ణుపురి తెల్లరంగు ఇది పవిత్రతకు గురుతు. దీనికన్నాపైన సర్తిల్ కాషాయము ఎరుపు కలగలుపు శంకరపురి శాంతి, జ్ఞానాలకు గురుతు. అంటే లోకంలో 3 వర్గల వంటి మానవజాతి ఉంటుంది బ్రహ్మలాగా, విష్ణువులాగా , శంకరునిలాగా ఈ ముగ్గురూ స్వభావసంస్కారాలలో ఆయా గ్రూపుస్వభావం వారికి నాయకులు ప్రతినిధులు. ఆ పైన పరంధామం అంటారు ఇది బంగారు ఎరుపు కాషాయవర్ణాల మిశ్రమం పూర్తి వెలుగు మయం శాంతి ధామం ఇక్కడ మనుషులు ఆత్మల రూపంలో అంటే జ్యోతిబిందువు రూపంలో ఉంటారు ఇక్కడే శివ పరమాత్మ ఆత్మలకు తండ్రి కూడా జ్యోతిబిందువు వలే ఉంటారు. ఇక్కడ ఆత్మలు ఒకవిధమైన జడస్థితి లో ఉంటారు సూక్ష్మ రూపంలో బ్రహ్మ విష్ణు శంకరపురులలో ఆత్మలకు సంకల్పాలు ఉంటాయి. ఈ రెండు లోకాల్లో స్థూల శరీరం ఉండదు 5 తత్వాలు ఉండవు భూమి, నీరు గాలీ ఆకాశం అగ్ని. ఈ భూమి మీదకు ఆత్మలు 4 యుగాలలో వరుసవారీ తమ తమ శరీరాలు తీసుకుని పాత్ర చేస్తాయి. ఆ పై రెండు లోకాలూ అతీంద్రియం ఇంద్రియాలు ఉండవు.
    భగవంతుడు కూడా ఆత్మ ఆయనను పరమాత్మ అంటారు. ఆయనకు తనకంటూ శరీరం లేదు జనన మరణ చక్రం లో రారు కనుక ఎప్పటికీ బిందు స్వరూపులే. కనుక ఆయనకు మిగతా రెండు సూక్ష్మ శరీరం కానీ స్థూల శరీరం కానీ లేవు. కానీ ఆయన ప్రవేశించగలరు. ఎవరిలో ప్రవేశిస్తారు? మనుష్య సృష్టికి తండ్రి ఐన పురుషునిలో అంటే మన మానవజాతి కంతటికీ పిత ఆయనను ఆదమ్, ఏడమ్, ఆదినాధుడు, ఆదిదేవుడు(మహాదేవుడు) అన్ని ధర్మాలూ కీర్తిస్తున్నాయి. ఆయననిరాకారుడు శివుడు, ఈయన సాకారుడు శంకరుడు. కనుక దేవుడు సాకారుడా నిరాకారుడా అనే ప్రశ్నకు తెరదించుతూ ఆయన నిరాకారుడు సాకారునిలో ప్రవేశించి శివశంకరుడైనాడు. ఈయన (శంకరుడు) మనలాంటి వాడే నరుడు పురుషార్ధం అంటే పురుషునికోసం తన ఆత్మకోసం చేసేది అది తపస్సు కావచ్చు (ముక్కుమూసుకు చేసేదే కాదు, తనువు, మనసు, ధనము, సమయము, సంపర్కము, సంబంధీకులు ఏ శక్తి తన దగ్గర ఉందో ఆశక్తులన్నిటినీ భగవత్కార్యంలో పెట్టడం పురుషార్ధం, దేహార్ధం దేహంకోసం కాదు ఆత్మ కోసం చేసేది) చేసి నరుడి నుంచి నారాయణుడిగా అవుతాడు. మనుషులు 84 లక్షల యోనులు ఉన్నాయి అంటారు కానీ ఇప్పుడు భగవంతుడు ఏమి చెబుతున్నారంటే మనుషులు 84 ఎక్కువలో ఎక్కువ తీసుకుంటారని. జన్మలలో వచ్చి వచ్చి నేను ఆత్మను అనే జ్ఞానం మరిచి పోయి దేహం అనుకుంటారు అప్పుడు అతీంద్రియ శక్తులు కోల్పోతారు ఆత్మ జ్ఞానం ఉన్నప్పుడు దేవతలం దేహభ్రాంతిలో మునిగిపోయినప్పుడు ఇప్పుడు మనం మనుషులం. వాళ్ళూ మనుషులే కానీ దైవీ గుణాలు ఉన్నాయి, మనకు లేవు కనుక మనను దేవతలు అనరు కానీ ఎప్పటికీ రావు ఉండవు అని లేదు కలియుగాంతంలో పరమపిత ఈ పరమాత్మ అంటే మనుషులకు తండ్రి ఆయనలో ప్రవేశించి మామూలు మనిషిలాగా ఐపోయిన ఆయనను మొదట తన సమానంగా (భగవంతుడిగా) చేస్తారు తరువాత ఆ పరమ గురువు ద్వారా మిగతా రాజయోగం నేర్చుకునే వారిని తయారు చేస్తారు.

    ReplyDelete
  9. తరువాత ఆ పరమ గురువు ద్వారా మిగతా రాజయోగం నేర్చుకునే వారిని తయారు చేస్తారు. నేర్చుకోని వారిని వీరినీ అందరినీ మాత్రం తనతో పాటు పరంధామానికి తీసుకు పోతారు. అందుకే ఆయనను కాలోంకా కాల్ మహాకాల్ అంటారు. మహా మృత్యువు. కలియుగం సమాప్తం అయ్యి సత్యయుగం(కృతయుగం) మళ్ళీ మొదలౌతుంది. ఇదే కాల చక్రం తిరుగుతూ ఉంటుంది. యుగం పేరు మనుషులను బట్టి వస్తుంది కానీ కాలం కాదు నిర్ధారించేది. సత్యయుగంలో అంతా సత్యంగా ఉంటారు కలియుగంలో అంతా అసురులు. కలియుగం కస్టాల యుగం.
    దేముడు ఈలాగున అనుకొనెను అనేదానికి కూడా బహుశా సమాధానం వచ్చి ఉండాలి. ఎందకంటే శివుడు శంకరునిలో ప్రవేశించి శివసాకారుడు అవుతున్నాడు. రెండు ఆత్మలు రెండు పేర్లు. రెండు కర్తవ్యాలు. శివుడు కల్యాణకారి. శంకరుడు వినాశకారి. శివలింగం అర్ధం కూడా ఉంది. ఒట్టిగానే ఏపనీ జరగదు. ప్రయోజనమనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే అని కాళిదాసంటాడు.

    ReplyDelete
  10. బ్రహ్మకుమారీ జ్ఞానంలో బ్రహ్మ అంటే ఆ శివపరమాత్మ ఎవరిలో ప్రవేశిస్తారో వారి పేరు బ్రహ్మ అని పెడతారు. బ్రహ్మకు ఐదు ముఖాలు చూబిస్తారు. వాటిలో ఓ ముఖం ముఖ్యమైన ముఖానిని నిందచేయడం వల్ల ఆయనకు పూజలేదు అంటారు దీనినే కధారూపంలో బ్రహ్మ అబద్ధం చెప్పారు అంటారు. ముఖ్యమైన ముఖం ప్రజాపితాబ్రహ్మ మిగతా నాలుగు ముఖాలూ కేవలం బ్రహ్మ. బ్రహ్మ అంటే తల్లి అని అర్ధం. ప్రజాపితాబ్రహ్మకూ మిగతాబ్రహ్మలకూ తేడా ఏమిటి అంటే ఆయన పిత మిగతావారు తల్లులు. మరి ప్రజాపితాబ్రహ్మ అని పేరు ఎందుకు వచ్చింది అంటే శివ పరమాత్మ పరమపురుషుడైతే ప్రజాపిత శరీరం ఆధారం చేసుకుని సృష్టి పరివర్తన కావిస్తున్నారు. ప్రజాపిత తన శరీరాన్ని శివునికి అంకితం చేసేశారు అర్జనుడు రధం ఇచ్చారంటారే అలాగా. రధం అంటే శరీరం. అహం బీజ ప్రదః పితా.... మమ యోనిః పరంబ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం అంటే ఈ ప్రజాపిత నా భార్య ఇతని బుద్ధిరూపి పొట్టలో జ్ఞానమనే బీజం వేస్తాను అని గీతలో చెప్పారు.

    ReplyDelete
  11. పరమ పురుషుడు శివుడు ఆత్మ రూపంలో మిగతా అంతా ఆయన భార్యలు మీరా కూడా ఇదే అంటుంది తన భర్తతో పురుషుడు ఒక్క నా ఠాకురే నని. కానీ బ్రహ్మలలో ఒక బ్రహ్మ తనే ఆ ప్రజాపితను అనుకుంటాడు కానీ అసలూ నకిలీ ఒకటే కాలేవు కదా.

    ReplyDelete
  12. Thanks for the very good article

    ReplyDelete
  13. మిత్రులకి ఒక శుబవార్త.

    నేను ఈ మధ్యనే యాండ్రాయిడ్ యాప్ తయారీలోకి దిగాను.ప్రస్తుతం చేస్తున్న యాప్ తెలుగు పంచాంగం మీద ఆధారపడి ఉంటుంది. పంచాంగపు లెక్కలు చాలా సంక్లిష్టం,అవి మాకు తెలియవు.కాకపోతే మిగిలిన పంచాంగం యాప్ తయారీదార్లు కూడా చేస్తున్నది ఒకటే - ఏవరో ఒక సిద్ధాంతి ఇచ్చిన వివరాల్ని తెసుకుని మక్కీకిమక్కీగా అక్కడ చూపించటమే!అయితే,కేవలం పంచాంగం చూపించి వూరుకోకుండా అదనంగా మేము కొన్ని వివరాల్ని చూపిస్తున్నాము.వాటిలో ఆలయాలను గురించిన ఒక సెక్షన్ ఉంటుంది.అందులో ప్రముఖమైన కొన్ని ఆలయాలకి సంబంధించిన ముఖ్యమైన వివరాలను పొందుపరుస్తున్నాము..

    ప్రతి ఆలయం గురించీ శ్రధ తీసుకుని ఆ ఆలయానికి ఉన్న విశిష్తత,చారిత్రక వివరాలు,ఎక్కడ వుంది - ఎలా చేరుకోవాలి లాంటి వివరాల్ని ఇస్తున్నాము,పైన "ప్రాచీనకాలంలోని .." దగ్గిర్నుంచి "....అలాంటి త్రిమూర్త్యాత్మకమైన రూపాలలో వెలిసి ఉన్నారు" వరకు ఉన్న కధనం గుడిమల్లం ఆలయానికి సంబంధించిన చోట వస్తుంది.అలాగే కనకదుర్గ గుది గురించి చెప్పే చోట కిరాతార్జునీయం కధ వస్తుంది.తిరుమల గురించి చెప్పడానికి శ్రీనివాస కల్యాణం కధ వస్తుంది.వాటి రచన,నిర్వహణ అంతా నాదే.ఇక్కడ పోష్టుల మాదిరిగా విస్తారంగా చెప్పకుండా క్లుప్తంగా చెప్పినప్పటికీ ఆ కొంచెంలోనే నా శైలిలో ఉండే మెరుపులతోనే ఉంటుంది వచనం!

    అప్లికేషన్ దాదాపు పూర్తి కావచ్చింది.వచ్చే నెలలో లైవ్ చెయ్యాలని చూస్తున్నాము.అది లైవ్ అయినప్పుడు తెలియజేస్తాను.బ్లాగులో నేను చెప్తున్న విషయాలకి మీనుంచి వస్తున్న ప్రోత్సాహం బాగుంది.అక్కడ కూదా ఇలాంటి ప్రోత్సాహమే లభిస్తే మరింత ఆనందం.

    __/\__

    ReplyDelete
  14. శుభాభీనం ద న లు

    ReplyDelete
  15. శుభాభీనం ద న లు

    ReplyDelete
  16. శుభం, మీకు అభినందనలు. అప్లికేషన్ విడుదలకిముందు దానిని ఎలా వాడాలో తెలిపే ఒక టపా వస్తే బాగుంటుంది.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...