Thursday 14 May 2015

విన్నారా?విన్నారా?ఈ వింతను విన్నారా?దేముడి దయవల్లనె ఇంగిలీజులరాజ్య మొచ్చెనంట!

          ఇదివర్లో గంధం వాసనేస్తూ ఉండే ఒక సబ్బుకి సాంప్రదాయబధ్ధమైన నురుగు అని వచ్చేది ప్రకటనల్లో?ఇప్పుడు బూతు వెబ్సైట్లని వర్గీకరించిన చిహ్నం లాంటి పేరుతో ఉన్న ఒక సబ్బుకి కూడా సంస్కారవంతమైన సబ్బు అని టముకేస్తున్నారు!సాంప్రదాయం,సంస్కారం అనే మాటల్ని ప్రతిదానికీ తగిలిస్తే యేమవుతుంది?అవి కూడా తొందర్లోనే బూతుమాటలైపోతాయి!కళ్ళముందు ఒక ఆడది తనకింకా ఆయుష్షు ఉన్నా బలవంతంగా మొగుడి చితిమీద తను కూడా తగలబడిపోవటం అన్యాయమని చెప్పటానికి కామన్ సెన్సు చాలదా!అయినా అంత నిష్ఠగా వాట్ని అంతకాలం యెందుకు కొనసాగించారు?ఒక మనిషి పట్టుదలగా దాన్ని ఆపాలని నిలబడితే అతన్ని ఆజీవ పర్యంతం యే వాదనతో వ్యతిరేకించారు?అది దుష్టమైనది అని తెలిసినా సాంప్రదాయం - పెద్దలు యెందుకు చెప్పారో చెప్పారు,పెద్దలు చూపిన దారిలో నడవటం అనే వాదనతోనే కదా!

          ఒక జాతికి తన ప్రాచీన సాంప్రదాయాల పట్ల వ్యామోహం ఉండటం ఒక వ్యక్తికి తన బాల్యం పట్ల ఉండే వ్యామోహానికీ సంబంధం ఉంటుందని యెంతమందికి తెలుసు?మనం చిన్నప్పుడు నెమిలి కన్నుని పుస్తకాల మధ్యన దాచి అది పిల్లల్ని పెడుతుందని యెదురు చూసి నిరాశపడటం ఇవ్వాళ మనకి నవ్వొచ్చినా అప్పుడు యెంత గంభీరంగా ఆ పని చేశామో గుర్తు వస్తే యెట్లా ఉంటుంది?ఆఖరికి ఆ సంస్కర్తలు యేమి చేశారు?జాతి చరిత్రని తవ్వి తీసారు, ఒకనాడు విదేశీ దంయాత్రలలో ముష్కరుల నుంచి యెదురవుతున్న తమ స్త్రీల మానహరణ ప్రయత్నాల్ని నిరోధించడానికి ఆ సాంప్రదాయం పాటించారనీ ఆ చారిత్రక పరిస్థితులు ఇవ్వాళ లేవు గాబట్టి మనం దాన్ని ఇప్పుడు కూడా కొనసాగించనక్కర లేదని నయాన వినేవాళ్ళకి తార్కికంగా ఋజువు చేసి దానినొక ఆర్జనమార్గంగా మార్చుకుని మొండిగా సంస్కరణని వ్యతిరేకిస్తూ భయాన లొంగేవాళ్ళని అప్పటి ప్రభుత్వాలతో శాసనాలు చేయించి శిక్షిస్తే గానీ ఆ దురాచారం యొక్క ప్రభావాన్ని తగ్గించలేకపోయారు, ఒక జాతి చరిత్ర ఆజాతి సామూహిక బాల్యం వంటిది!

          అలాంటి చరిత్రని అబధ్ధాలతో నిర్మిస్తే యెట్లా?చరిత్ర అబధ్దం చెప్తే యెట్లా?అద్దం మోసం చేస్తే యెట్లా?మన తప్పుల్ని సవరించుకునే అవకాశం కల్పించే చరిత్రని కూడా రాగద్వేషాలతో కలుషితం చేస్తే యెట్లా?ఒక జాతి ఒక తరంలో యెన్ని భిన్నమైన పోకడలు పోయినా అది మరో తరానికి తన ముందరి తరం నుంచి అందుకున్న వారసత్వపు సంస్కృతీ విశేషాన్ని పదిలంగా అందిస్తే ఆ జాతి గమనం యేకోన్ముఖంగా సాగుతున్నట్టు లెఖ్ఖ!అట్లా కాకుండా ఒక తరం యొక్క ప్రవర్తన ఒకరికి ఒక రకంగా మరొకరికి మరో రకంగా అర్ధమయితే అక్కడ ఖచ్చితంగా పులుముడు ప్రవేశించిందన్నమాటే గదా?ప్రతి వర్గమూ ఆ తరాన్ని అర్ధం చేసుకోవడానికి ముందుగానే మనం ఈ విధమయిన అర్ధాన్నే లాగాలి అనే వ్యూహంతోనే చరిత్ర నిర్మాణానికి పూనుకున్నారని అర్ధం అవుతుంది గదా!జరిగిన సంఘటనల్ని మార్చడం లేదు, కానీ విశ్లేషణలు మారుతున్నాయి - యేకం సత్ విప్రాని బహుధా వదంతి అనే విభిన్నత పట్ల సహనశీలాన్ని పెంచే మాటని భవిష్యత్తుని యేకోన్ముఖంగా  తీర్చిదిద్దుకోవటానికి పనికివచ్చే చరిత్రకి అంటగట్టవచ్చునా?

         పాఠ్యపుస్తకాల్లోకి యెక్కించి తప్పనిసరిగా తెలుగు చదవటం వచ్చిన ప్రతివాడికీ పరిచయం చేస్తే చదివిన ప్రతివాడూ తలలూపి మెచ్చుకున్న "దేశమును ప్రేమించుమన్నా" అనే మంచి భావాలతో నిండిన గీతం రాసిన కవి గొప్ప దేశభక్తుడనుకుంటాం.కానీ ఆ వ్యక్తి భారతదేశానికి ఇంగ్లీషువాళ్ళ పరిపాలన మరికొంతకాలం అవసరమనే అభిప్రాయంతో వుండేవాడనీ మీదుమిక్కిలి ఇంగ్లీషువాళ్ళ పట్ల కొంచెం కఠినమైన పదాల్ని అప్పటి స్వాతంత్ర్యవీరులు వాడీతేనే వాళ్ళని వ్యతిరేకించేవాడనీ యెంతమందికి తెలుసు?"నతులగుచున్ మహోన్నతి దనర్చుచు నవ్యగుణోక్తిచే గుణోన్నతి బ్రకటించుచుం బరజన ప్రియ కార్యసమర్ధతన్ సముచిత నిజకార్య సంగ్రహము నిష్ఠురవాదులన్ క్షమాధృతి నిరసించుచుం బరగు ధీరులు పుణ్యులు గారె యేరికిన్" అనే విధంగా బతికి "ఒకవంకన్ పదివేల కంఠములతో హుంకారముల్ సల్పి సాంఘికశార్దూలము చప్పరించుటకు లంఘించన్ రవంతేని జంకక దీక్షారధమున్ మరల్పక కళాక్షత్రము రూపించు ధార్మిక వేదండుని ఉక్కుగుండెలు మహాంధ్రీ నీకు ఆదర్శమౌ గాక!" అంటూ కవులు కీర్తించిన కందికూరి వీరేశలింగం కన్నా ఇతనికే నవయుగ వైతాళికుడిగా పేరు రావడం వెనక ఇవ్వాళ్టి కంచె ఐలయ్య లాంటివాళ్లకి "బ్రాహ్మణవాదం" పిలకని అందించిన కోవర్టు పని చేసినందుకేనని నేనంటే మీకు విడ్డూరంగా ఉండవచ్చు.కళ్ళు మూసుకుపోయిన హిందూ మత చాందసత్వంతో పరమ సజ్జనుడైన వ్యక్తికి కూడా దుర్మార్గం అంటగడుతున్నానని మీరు అపార్ధం చేసుకునే అవకాశం కూడా వుంది!

Lives of moderates all remind us
We should wisely keep from crime
Open sedition only finds us
Shelter in a far off clime
Let us then line up and speaking
Speaking at a furious rate
Not always some benefit seeking
Learn to be loyal and to wait.

          ఈ కవి పై కవితలో చెప్పిన హితోక్తిని అప్పటివాళ్ళు పాటించి ఉంటే ఇప్పటికీ మనం యే తిరుగుబాట్లూ చెయ్యకుండా సంస్కారవంతమైన ఇంగ్లీషువాళ్ళ పరిపాలనలోనే ఉండేవాళ్ళ మనుకుంటాను. యెటూ క్రైస్తవం ప్రజాస్వామ్యబధ్ధమైన మతమే కాబట్టి ఐలయ్య లాంటివారికి కూడా ఆమోదయోగ్యంగానే ఉండి ఉండేదేమో!గురజాడ అప్పారావు బతికిన కాలం క్రీ.శ1862 నుంచి క్రీ.శ1915 వరకు,అంటే ఇంగ్లీషువాళ్ళు పరమదుర్మార్గులు అని గ్రహించి వాళ్ళ కబంధహస్తాల నుంచి భారతమాతని విముక్తం చెయ్యాలని సామాన్యులు కూడా ప్రాణాలకి తెగించి పోరాడుతున్న రోజుల్లో వారికి పూర్తి విరుధ్ధమైన అభిప్రాయాలతో ఉన్నాడితను?స్వాతంత్ర్య సమరవీరులు అబధ్ధం చెప్తున్నారా?నవయుగ వైతాళికుడు అబధ్దం చెప్తున్నాడా?ఒక తరం వెనకటి చరిత్ర తిరగేస్తేనే అప్పటి సమకాలికుల్లోనే ఇంత పరస్పర విరుధ్ధమైన అభిప్రాయాలు ఉంటే ఇంకా వెనక్కి వెళ్ళి తాతతాతల నాటి కధల్ని తవ్వితీస్తే ఇంకెంత గందరగోళం బయటపడుతుందో?కురుక్షేత్రం సినిమాలో శకుని వేషం కట్టిన నాగభూషణం మాదిరి ఉభయతారకంగా "ఇదియునూ సూనృతమే అదియునూ సూనృతమే" అనేసి తప్పుకుందామా!

          గురజాడ అప్పారావు కాలానికి మరొక శతాబ్దం వెనక్కి వెళ్తే క్రీ.శ1780 నుంచి క్రీ.శ1835 వరకూ చెన్నపట్నం సుప్రీం కోర్టులో ఇంటర్ప్రిటర్ పని చేసి క్రీ.శ1836లో సన్యసించి యోగసాధనతో తనువు చాలించిన యేనుగుల వీరాస్వామయ్య గారు కూడా తన యాత్రాస్మృతిగ్రంధం "కాశీయాత్ర చరిత్ర"లో ఆంగ్లేయులను చాలా మర్యాదగా ప్రస్తుతించారు.ఇందులో బ్రహ్మణులు శూద్రజాతిని మిక్కిలీ తక్కువ పరచి అవమానించుట ఇతర మతములు వృధ్ధిబొందుటకు హేతువైనదనిన్నీ,పెద్దలు పామరజనులను కడతేర్చవలెనని బింబారాధనను విధించితే భగవంతునికి హేయములైన వికారపు ఉపచారములను లోకులు చేయసాగినందుననున్ను బ్రాహ్మణులు మేము శ్రేష్ఠులమని ఇతరవర్ణాలను ధిక్కరించడము వల్లనున్ను,వీరి దురాచారముల వల్లనున్ను వీరియెడల భగవంతునికి కటాక్షము తప్పినందున సత్యము అహింస మొదలగు సుగుణసంపత్తులు గల ఇంగ్లీషువారు హిందూదేశము యేలేటట్టు వారు దేవుని కృపకు పాత్రులైనారనిన్ని చెప్పబడినది. ఇందులో యీశ్వరుడు పరులకు యీ హిందూదేశమును స్వాధీనపరచినందుకు కారణ మేమంటే అందరున్ను అహింస సత్యము మొదలైన సద్గుణాలతోనే నటిస్తే తన చిద్విలాసానకు వ్యతిరిక్తమని యెంచి ఇచ్చటి వారికి కామక్రోధాదులను వృధ్ధిబొందించి తద్వారా బ్రాహ్మణుల గుండా ఇచ్చటి క్షత్ర జాతిని బొత్తిగా నశింపజేసి వెనక బ్రాహ్మణులకు గర్వభంగము కొరకు తురకలను కొన్నాళ్ళు వృధ్ధిపరచి మళ్ళీ కరుణతో సాత్వికులైన యింగిలీషువారికి యీ దేశాధికారమును యిచ్చినాడని చెప్పియున్నది.

          మరి క్రీ.శ1825 న పుట్టి క్రీ.శ1917 వరకూ జీవించి భారతీయులందరికీ "గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా" పేరుతో పరిచయమైన దాదాభాయ్ నౌరోజీ అయితే నిర్ద్వందంగా సంవత్సరాల వారీగా గణాంకాలతో సహా "Further development was checked by the frequent invasions of India by, and the subsequent continuous rule of, foreigners of entirely different character and genius, who, not having any sympathy with the indigenous literature— on the contrary, having much fanatical antipathy to the religion of the Hindus – prevented its further growth. Priest-hood, first for power and afterwards from ignorance, completed the mischief, as has happened in all other countries" అని తేల్చి చెప్పాడు,అయినా యేందుకీ ఆంగ్లేయులు మంచివాళ్ళు క్రైస్తవం మంచి మతం అనే ముసుగు సిధ్ధాంతాలు మళ్ళీ మళ్ళీ ప్రచారంలోకి తెస్తున్నారు కొందరు వ్యక్తులు?ఈయన క్రీ.శ1892లో బ్రిటిష్ పార్లమెంటుకి యెన్నికై తాను క్రైస్తవుడు కాదు గనక బైబిలు మీద ప్రమాణం చెయ్యడానికి నిరాకరించి "Khordeh Avesta" మీద భగవంతుని పేర ప్రమాణం చేసి సభలో అడుగు పెట్టిన స్వాభిమానం గల భారతీయుడు!

          ఆర్ధిక శాస్త్రంలో అఖండమైన పరిజ్ఞానం కలిగిన నౌరోజీ మహాశయుడు ఆంగ్లేయులు భారత దేశాన్ని యెలా పీల్చిపిప్పి చేశారో సోదాహరణంగా నిరూపించాడు.అక్క 6 అంశాలు ఉన్నాయి:మొదటిది భారతదేశం విదేశీయుల చేత పరిపాలించబడుతున్నది,రెండవది ఇతర్లని ఇక్కడికి వచ్చి సంపద పెంచేటందుకు ఆహ్వానించి పెట్టుబడుల్ని ఆకర్షించే స్థితిలో లేకపోవటం అంటే సర్వసత్తాక సార్వభౌమ ప్రభుత్వం లేకపోవటం,మూడవది బ్రిటిష్ ప్రబుత్వాధికారుల్నీ వారి అవసరార్ధపు సైన్యాన్నీ పోషించాల్సి రావటం,నాల్గవది ఇంటా బయటా సామ్రాజ్య విస్తరణ భారాన్ని మొయ్యటం,ఐదవది విదేశీయులకి అధిక జీతభత్యాలు దొరికే విధంగా స్వేచ్చావాణిజ్యానికి తలుపులు తెరవటం,ఆఖరుదైన ఆరవది ముఖ్యమైన ఆదాయాన్ని పెంచే వర్గాలు విదేశీయులు కావదం వల్ల తమ కొనుగోళ్లని దేశం బయట చెయ్యటం గానీ లేదా తమ ఆదాయాల్ని దేశం బయట దాచటం - కరుణామయుని బోధనల్ని నిత్యమూ జపిస్తూ ఐలయ్యగారు పొగుడుతున్న ప్రజాస్యామ్యబధ్ధమైన మతాన్ని అనుసరించే వాళ్ళు ఈ దేశాన్ని అంత భయంకరంగా దోచుకున్నారు!ఒక అతి పెద్ద స్పాంజిని గంగా నదిలో ముంచి ఆ నీటినంతా ఒడిసిపట్టి ధేంసు నదిలో పిండినంత క్రూరమైన దోపిడీ అది!ఇప్పటికీ మన పాఠ్యపుస్తకాల్లో గొప్పగా చెప్తూ ఉండే రైళ్ళను వేయించడం లాంటివాటి బండారం కూడా అప్పుడే బయటపెట్టాడు - మన దేశపు ఆదాయంతోనే నిర్మించారు,మన దేశపు జనం అటూ ఇటూ తిరగడానికి ఉపయోగపడినాయి,కానీ ఆ డబ్బంతా ఇక్క నిలవలేదు గదా?

          యేనుగుల వీరాసామయ్య గారంటే సత్తెకాలం వాడని సరిపెట్టుకోవచ్చు గానీ గురజాడ కాలానికి స్పష్టంగా తెలిసిపోయింది గాబట్టి అతన్ని మాత్రం అనుమానించాల్సిందే!వీరాసామయ్య గారు చేసింది కోర్టు కాగితాలని తర్జుమా చెయ్యటం - ప్రజలతో రోజువారీ సంబంధం లేని ఉద్యోగం.కీలకమైన ఉద్యోగం కావడం వల్లనూ ఆయన అనువాదంలో మంచి ప్రతిభ గలవాడవటం వల్లనూ ఆర్జన కూడా యెక్కువే ఉండి ఉంటుంది!ఆ ఉద్యోగంలో ఉండటం వల్ల వీలునామాలకి సంబంధించిన భయంకరమైన విషయాలు యెక్కువగా తెలియడం వల్లనే వైరాగ్యం మీదకి మనసు మళ్ళిందని చెప్పడం వల్ల అతనికి ఇంగ్లీషువాళ్ల వల్ల బాగా లాభపడి అట్లా సమర్ధించాడనే విధంగా డబ్బాశని అంటగట్టలేము.దేశాటనలో తనకి కనబడిన విషయాల పట్ల తనకు కలిగిన సందేహాలకి  తనకు తోచిన జవాబులు చెప్పుకోవడం వరకే పరిమితమై పోయాడు గనక అందులోని కొన్నింటిలో శాస్త్రీయత ఉండదు,నిజమే!కానీ క్రైస్తవం మహమ్మదీయం వంటి ఇతర మతాల్ని గురించి కూడా మంచిగానే మాట్లాడాడు గనక హిందూమతోన్మాది అని మాత్రం అనలేము!కానీ గురజాడ అప్పారావు తన కన్యాశుల్కం నాటకంలో బ్రాహ్మణుల్ని వెక్కిరించే కుళ్ళుజోకుల్ని తీసేస్తే గొప్పగా చెప్పడానికి యేం ఉంది?ఆడపిల్లల్ని అమ్ముకోవడం గురించి రాసిన వ్యాసాల్లో గూడా అమ్మకాలు కొనుగోళ్ల లెక్కలు చెప్పడం తప్ప శాస్త్రీయమైన విశ్లేషణ యేదైనా చేశాడా?

          సాంప్రదాయం చెప్పే పితృకర్మల పట్ల వ్యామూహాలూ ఆస్తిపాస్తుల మీద వచ్చిపడే వార్సత్వపు హక్కుల్నీ పట్టించుకోకపోయినా ఒక వయసు రాగానే లైంగికావసరాల కోసమైనా ఖచ్చితంగా స్త్రీ పురుషుల కలయిక అవసరమే!అయితే అన్ని మతాల్లోనూ ఆ కలయిక వివాహ విధి ద్వారానే జరగాలనే నియమం ఉంది కాబట్టి పెళ్ళి తప్పనిసరి - ఇప్పటికీ సహజీవనం అనేది కొద్దికాలానికే తప్ప ఆజీవపర్యంతమూ అట్లా ఉండటం కుదరటం లేదు,అవునా?ఆ పెళ్ళి సమయంలో మొదట "కన్యాం కనక సంపన్నాం" అని సంతోషంగా ఇచ్చేది వరశుల్కమైతే ప్రతివారూ మగపిల్లల కోసమే ఆత్రపడి ఆడపిల్లల్ని నష్టం కింద చూడటంతో ఒకానొక కాలంలో ఆడ-మగ పిల్లల మధ్య ఉండాల్సిన లైంగిక నిష్పత్తి లెక్కల ప్రకారం ఆడపిల్లలకి కరువు రావడం వల్ల ఉనికిలోకొచ్చిన ప్రత్యేకమైన వ్యవహారం "కన్యాశుల్కం" అనేది.దీనికి సంబంధించిన చారిత్రక విశ్లేషణ అతని సాహిత్యమంతా వెతికినా మీకెక్కడయినా కనిపిస్తుందా?పెళ్ళి సమయంలో దబ్బు మార్పిడి "ఓలి","కట్నం" లాంటి రూపాల్లో అన్ని కులాల్లోనూ ఉంది కదా!డబ్బాశతో అన్ని కులాల వాళ్ళూ చేసే చెత్తపన్లకి బ్రాహ్మణుల్ని మాత్రమే కారకుల్ని చెయ్యడం దేనికి?గురజాడ కావాలని చెయ్యకపోవచ్చు - పాత్రల్ని సహజంగా వుంచటం కోసం తను బ్రాహ్మణుడు కాబట్టి తనకి బాగా తెలిసిన వాతావరణాన్ని వాడుకుని ఉండవచ్చు!కానీ అసలు వైతాళికుడు వీరేశలింగాన్ని వదిలేసి గురజాని పరిధికి మించి ఆకాశాని కెత్తిన వాళ్ళు మాత్రం తేనెటీగ పువ్వుల మీదా పోతుటీగ శ్లేష్మం మీదా వాలటం సహజమేనని నిరూపించుకున్నారు.

         భారతదేశపు చరిత్రలోని సంక్లిష్టతల్ని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటుంటే ఒకోసారి సినేమా కధల్లోని ఆకురౌడీల మధ్యన జరిగే క్యామిడీ ఫైట్లను బోలిన కుక్కజట్టీలు కూడా చాలా గంభీరంగా సిధ్ధాంత ప్రాతిపదికన జరగటం చూస్తే నాకప్పుడప్పుడూ పొట్టచెక్కలయ్యేలా నవ్వు కూడా వస్తూ ఉంటుంది!ఇవ్వాళ పరస్పరం ఘూర్ణిల్లుతున్న "హిందూ జాతీయ వాదం" మరియూ "బ్రాహ్మణ వ్యతిరేక వాదం/దళిద వాదం" అనే రెండు శాఖలూ మొదట్లో ఒబ్బిడిగా కలిసిపోయి ఈ దేశం మీద జమిలిగా పెత్తనం చేసెయ్యాలని కలలు గని అది కుదరకపొయ్యేసరికి తెగదెంపులు చేసుకున్న పాతస్నేహితులు ఒకళ్ళ మీదకి ఒకళ్ళు విసురుకున్న పేడముద్ద్దలు తెలుసా?వ్యాపారం కోసం ఈ దేశానికి వచ్చి ఇక్కడున్న పరిస్థితుల వల్ల మిగతా దేశాల్లో మాదిరిగా కాకుండా పై స్థాయిలోని రాజుల్ని మచ్చిక చేసుకోవడం ద్వారా రాజకీయాధికారం చేజిక్కించుకున్నారు,ఆ తర్వాత సాంస్కృతిక ఆధిపత్యం కూడా బ్రాహ్మణుల్ని మచ్చిక చేసుకుంటే చాలు పనైపోతుందనుకున్నారు - కానీ ఆ ప్లాను బెడిసికొట్టింది!మొదట్లో మతప్రచారానికి ఇక్కడి కొచ్చిన వాళ్ళలో గుండు గీసుకుని కాషాయం కట్టి పేరు మార్చుకుని బైబిలే అసలైన వేదం అని ప్రచారం చెయ్యబోయిన వాళ్ళూ ఉన్నారు,మాక్సు ముల్లరు మహాశయుడు సంస్కృతం నేర్చుకున్నది కూడా మన దేశపు సంస్కృతి మీద ప్రేమతో కాదు మన దేశాన్ని క్రైస్తవీకరించడానికి కావలసిన దారులు వెతికేటందుకు మిగతావాళ్ళకి సహాయం చెయ్యడానికే!

          హిందూ రాజుల మరియూ ముస్లిము నవాబుల రాజ్యాలు పూర్తిగా ఇంగ్లీషు వాళ్ళకి దఖలు పడినా లేక పరస్పరాంగీకారంతో రాజుల పరంగా నడపబడినా ఆ ప్రాంతపు కలక్టర్లే నిజమైన అధికారం చెలాయించేవాళ్ళు.ఆలయాల మీద ఆదాయం కూడా వచ్చేది కాబట్టి ఆలయాల నిర్వహణ విషయాల్లో ఉదారంగానే ఉండేవాళ్ళ్ళు - ఆలయానికి యెంత యెక్కువ ఆదాయమొస్తే వాళ్ళకి అంత యెక్కువ వాటా వస్తుంటే మూర్ఖంగా యెవడు అడ్డుకుంటాడు?తిరుమల లాంటి ప్రముఖ ఆలయాల నిర్వహణ చరిత్ర చూస్తే ఈ సత్యం బోధపడుతుంది.తమ ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా సహనంగా ఉన్నందుకే యేనుగుల వీరాస్వామయ్య గారు అలా పొగిడింది!అయితే పోను పోనూ ఈ హిందూ దేవాలయాలు కలక్టర్ల చేత అట్లా ఆదరించబడుతున్నంత కాలం తమ చర్చిలకి పాప్యులారిటీ మరియూ ఆదాయమూ రాదని తెలుసుకున్న క్రైస్తవ మతప్రచారకులు రివర్స్ గేరులో ఒక ద్విముఖవ్యూహాన్ని పన్నారు - మొదటిది అధికారంలో ఉన్న తమవాళ్ళని హిందూమతాన్ని యెక్కువగా ఆదరించవద్దని ఒత్త్తిడి తీసుకురావటం,రెండవది తమ మామూలు పధ్ధతైన కష్టాల్లో ఉన్నవాళ్ళ మీద ప్రార్ధనలు,పాపక్షమాపణలు,మారుమనస్సు,దేవుని రాజ్యం,శిలువ మహిమ లాంటివాటితో బెదరగొట్టి వూదరగొట్టటం.మొదటి దానివల్ల బ్రాహ్మణులకీ వాళ్ళ ప్రభావంతో వున్న రాజులూ జమీందారులకి ఆంగ్లేయులతో దోస్తీ తెగెపోయి పోయిన ప్రాభవాన్ని తెచ్చుకోవడానికి అప్పటి బ్రాహ్మణుల్లో తెలివైనవాళ్ళు జాతీయవాదం అనేదాన్ని కనిపెట్టి ఇంగ్లీషువాళ్లని దేశంనుంచి వెళ్ళగొట్టెయ్యాలనే ఆవేశం తెచ్చుకుని ద్వితీయ స్వాతంత్ర్యభారతసమరానికి సిధ్ధమయ్యారు.రెండవదానినుంచి కింది కులాలకి బ్రాహ్మణులే మీ కష్టాలన్నిటికీ కారణం అనే ప్రచారంతో కిందికులాల వాళ్లని హిందూసమాజం నుంచి విడగొట్ట్గలిగారు ఇంగ్లీషువాళ్ళు!ఇరువర్గాలూ ప్రజలకి తమ అతితెలివి పులుముడు సిధ్ధాంతాల్ని ప్రచారం చేసి నమ్మించి వాటిని తమ ప్రాభవాల్ని నిలబెట్టుకోవటం కోసమే ప్రయత్నించారు,యెందుకంటే ప్రజలకి నిజంగా ఉపయోగపడే విషయం ఈ రెండు వాదనల్లో దేనికీ లేదు!వాళ్ళ లక్ష్యం ప్రాభవాల కోసం పాకులాడ్డం గనక తాము క్షేమంగా ఉండాల్సిన అవసరం యెక్కువగా ఉంది కాబట్టే మోకంగాంధీ యొక్క దిక్కుమాలిన అహింసాయుత పోరాటం రెండు వర్గాలకీ అంత గొప్పగా నచ్చింది!ఇందులో రెండువైపులా పదునైన కత్తికున్న సులువుంది, అది యే వర్గం వాళ్ళు గెల్చినా ఒకరంటే ఒకరికి తీవ్రమయిన ద్వేషం లేకపోవడం వల్ల ఓడిపోయిన వర్గం నుంచి అందులోకి దూకేసి ప్రాభవాన్ని నిలబెట్టుకోవచ్చు!ఇవ్వాళ్టి పార్టీ ఫిరాయింపుల వెనక ఉన్నదీ వీరందరిలో ఉన్న ఇలాంటి యేకోన్ముఖమైన సంస్కృతీ ప్రభావమే!

          నేను కాంగ్రెసుని ద్వేషించటం నా జన్మ హక్కు?! (మోహన్ దాస్ కరంచంద్ గాంధీ) అనే పోష్టులో "అంత పిరికిగా  వ్యతిరేకత వచ్చిన రెండేళ్లలోనే అదిరి పడి పారిపోయిన వాళ్ళు, అదీ ఈ దేశజనభాలో 5% మించని వాళ్ళూ అన్నేళ్ళ పాటు అంత మొండిగా అన్ని దుర్మార్గాలు యెట్లా చెయ్యగలిగారు?పైస్థాయిలో వున్న మనుజేశ్వరాధములు అరాచకం పేరుతో హడావుడి చేసి పోలీసుల్నీ సైన్యాన్నీ ఇంగ్లీషువాళ్ళ పేరు మీద పంపిస్తే ఈ బానిసాధముడి నట్టువాంగం మేజువాణీ గాళ్ళు ఆ పోలీసుల్ని ఇంగ్లీషు వాళ్ళ దౌష్ట్యానికి చిహ్నంగా చూపించి డబుల్ గేము యేదయినా అడారా?" అని ఒక చిన్న అనుమానం వ్యక్తం చేశాను.అక్కడ నాకొచ్చిన అనుమానానికి ఇక్కడ జవాబు దొరికింది - ఆంగ్లేయుల్ని దుర్మార్గులుగా చిత్రీకరించిన ఆ పులుముడు జాతీయత ఆంగ్లేయులతో స్నేహంగా ఉన్నప్పటి ప్రాభవాన్ని తిరిగి తెచ్చుకోవడానికి పై స్థాయిలో ఉన్నవాళ్ళు అప్పుడే నిద్రలేచినట్టు నటించి చూపించిన నాటకం!

          ఇవ్వాళ తను క్రైస్తవంలో చేరి ఐలయ్య గారు యెవరి నయితే పొగుడుతున్నాడో వాళ్ళు అనాగరికులు అని విమర్శించినది తమ పూర్వీకులనేననేది చరిత్ర సరిగ్గా చదివితే అర్ధం అవుతుంది యెంతటి పామరుడికైనా,ఆయన కెందుకు అర్ధం కాలేదో?ఆయన యేమి చదివి యే ప్రభావంతో ఆ సూత్రీకరణలు చేస్తున్నాడో గానీ చరిత్రనీ మతాలనీ రాగద్వేషాల కతీతంగా అధ్యయనం చేసిన వాడెవ్వడూ ఆయుధాలు ధరించడం వల్ల హిందూ దేవతలు అప్రజాస్వామికమైనవాళ్లనీ బుధ్ధుడూ జీసస్సూ మానవులుగా పుట్టి వాళ్ళ సొంత ప్రతిభతోనే ప్రపంచ దైవాలుగా యెదిగారనే సూత్రీకరణలు చెయ్యడు!ఆయుధం హింసకే గుర్తయితే ఘనత వహించిన తమ ఆధ్యాత్మిక సామ్రాజ్య ప్రభువులైన అమెరికా దొరతనం  వారు అణ్వస్త్రాల మీద అధిపత్యాన్ని సడలనివ్వకుండా యెందుకు దృఢంగా నిలబెట్టుకుంటున్నారో చెప్పగలడా?శిలువ అనే చిహ్నమూ జీసస్ అనే దైవపుత్రుడూ పూజలందుకుంటున్న విషయం తెలిశాక గూడా క్రైస్తవం విగ్రహారాధనకి దూరంగా ఉందని యే ముఖం పెట్టుకుని అనగలుగుతున్నాడు!క్రైస్తవం లాగ కరుణ గురించి చెప్తూ పైగన్లనీ యూదుల్నీ అంత కిరాతకంగా అణిచివేసే హిపోక్రసీ హైందవధర్మంలో లేదు,ఆయుధం ఇక్కడ దుష్టశిక్షణకి గుర్తు!క్రైస్తవుడైన హిట్లర్ నాలుగు కోట్లమంది యూదుల్ని చర్చి అనుమతితోనే హతమార్చాడని ఐలయ్యకి తెలుసా తెలియదా?యూదులకి ఒక మతం ఉందని యెంతమందికి తెలుసు?దాన్ని అణిచేస్తే తప్ప క్రైస్తవం యెదగదని హిట్లర్ అనే నరహంతకుడికి నిధులిచ్చి క్రైస్తవ మత రక్షకుడని బిరుదు లిచ్చి గాలికొట్టి వొదిలిన మతంలో ప్రజాస్వామ్య స్వభావం కనిపించిందా ఈ ప్రబుధ్ధుడికి?యెన్ని సర్వసత్తాక సార్వభుమత్వం గలిగిన స్వతంత్ర దేశాల్నీ బ్రిటన్ మరియూ అమెరికా ఆక్రమించి వారి సంస్కృతుల్ని శిధిలం చేసి చెలరేగిపోతే ఆ విశ్వవ్యాప్తత వచ్చిందో తెలియని దెవరికి?కొత్తరకం కమ్యునిష్టు సామ్రాజ్యవాదాన్న్ని పాటిస్తున్న చైనా దేశమూ జాత్యహంకారంతో మూర్ఖంగా ప్రవర్తించి అణువిధ్వంసం చెలరేగడానికి కారణమైన జపాను దేశమూ తమిళులకి కనీసం ఓటుహక్కు కూడా ఇవ్వకుండా అంతులేని అత్యాచార పరంపరతో నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించి తీరా దాన్ని యెదుర్కోవడానికి పులిలాంటి ప్రభాకరన్ విరుచుకుపడ్గా ప్రపంచదేశాల్లో ముఖరక్షణ కోసం అతనినే విలన్ అని ప్రచారం చేసిన సిగ్గులేని శ్రీలంకా పరమ ప్రశాంతమైన భౌధ్ధమతాన్ని అనుసరిస్తూనే ఆ పాపకర్మలు చేశాయి గదా - ఇంకా అవి ప్రజాస్వామ్యబధ్ధమైనవేనని వాదిస్తే "వాళ్ళు మొదట కమ్యునిష్టుల కోసం వచ్చారు,నేను కమ్యునిష్టుని కాదు కాబట్టి మాట్లాడలేదు.తర్వాత వాళ్ళు యూదుల కోసం వచ్చారు,నేను యూదును కాదు కాబట్టి మాట్లాలేదు.తర్వాత వాళ్ళు కార్మికనాయకుల కోసం వచ్చారు,నేను కార్మికనాయకుణ్ణి కాదు కాబట్టి మాట్లాడలేదు.తర్వాత వాళ్ళు కాధలిక్కుల కోసం వచ్చారు,నేను కాధలిక్కును కాదు కాబట్టి మాట్లాడలేదు.చివరకు వాళ్ళు నాకోసం వచ్చారు,అప్పటికి మాట్లాడేందుకు యెవరూ మిగిలిలేరు?" అని అంతా అయిపోయాక ఆక్రోశించిన మార్టిన్ నీమోలర్ మాదిరిగానే అఘోరించాల్సి వస్తుంది ఒకనాటికి!

          పాయింట్లవారీగా "ప్రపంచ మానవాళి ముందు మూడురకాల దేవుళ్ళ ఆలోచన,ఆచరన అరళులు ఉన్నాయి.{1} ఆబ్స్ట్రాక్ట్ దేవుడు, {2} మానవులుగా పుట్టి ప్రవక్తలుగా మారి క్రమంగా పరపంచదేవుళ్ళుగా మారిన వ్యక్తులు, {3} ఊహాజనిత మానవాకార దేవతలు" అని చాలా గొప్పగా వర్గీకరించానని మురిసిపోతున్నాడు.కానీ తన మతమయిన క్రైస్తవంతో సహా అన్ని మతాల్లోనూ అంతర్భాగంగా ఈ మూడురకాల ఆలోచనా ధోరణులూ వున్నాయని కొంచెం బుర్రపెట్టి ఆలోచిస్తే ఈజీగా తెల్సుకోవచ్చు,ఆయనగారు తిన్నగా ఆలోచిస్తే గదా?క్రైస్తవంలోనే యెహోవా - ఆబ్స్త్రాక్ట్ దేవుడు,జీసస్ ప్రవక్త,గాబ్రియేలు - దైవదూత అనే మూడు అంశాలూ ఉన్నాయి కదా!బౌధ్ధంలోనూ తధాగతుడు లేక బోధిసత్త్వుడు - ఆబ్స్ట్రాక్ట్ దైవం,గౌతమ బుధ్ధుడు - ప్రవక్త,మారుడూ అతని కుమార్తెలు - వూహాజనిత మానవాకార దేవతలు అనే మూడు అంశాలు ఉన్నాయి కదా?యెక్కడ ముస్లిము మతాన్ని ప్రస్తావించినా ఇవ్వాళ పూర్తి స్థాయి మతంగా వెలుగొందుతున్నదనే విషయాన్ని గుర్తించకుండా, నేడు ప్రపంచాన్ని ప్రభావితం చేసే మతాల్లో అది కూడా ఓకటని ఒప్పుకోకుండా క్రైస్తవం నుంచి పుట్టిన శాఖగా మాత్రమే చూస్తూ అవమానించటం ప్రజాస్వామ్యయుతమైన మతాన్ని పాటిస్తున్నానని డప్పు కొట్టుకుంటున్న ఇతనికే చెల్లింది?మరి గౌతమబుధ్ధుడు తాను కొత్తమతాన్ని స్థాపించటానికి ముందు ఒక క్షత్రియ హిందువు కాబట్టి బౌధ్ధం కూడా హిందూ మతంలోని శాఖ అని మనమంటే మాత్రం ఒప్పుకోడు, యెందుకనో?ఇంతవరకూ యే హిందూ మేధావీ ఇతను కక్కినంత విషాన్ని ముస్లిము మతం మీద కక్కలేదు - అదీ హిందువుల ఔన్నత్యం!

          ఒకోసారి మనం యెదటివాళ్ళకి మంచిదౌతుందని చేసిన పని అవతలివాడు తనకి ద్రోహం చెయ్యడానికే మనం ఆ పని చేశామని అపార్ధం చేసుకోవచ్చు - పుణ్యానికి పోతే పాపం యెదురైందన్నట్టు!ఒకోసారి యెదటివాడు ఖచ్చితంగా మనకి ద్రోహం చెయ్యాలనే ఉద్దేశంతొనే చేసినా మనకి వూహించని వైభవాన్ని తీసుకురావచ్చు - అంతా మనమంచికే అన్నట్టు?ఆ మధ్యయుగాల నాటి రాజ్యాలతో కాలం యెన్ని యుగాలు గడిచినా దేశంలో యేకత్వం యేర్పడకపోయేది - ఇంగ్లీషు వాళ్ళమీద పోరాడిన వాళ్ళు కూడా తమ రాజ్యపు సరిహద్దుల లోపల తమ పెత్తనం జరక్కపోవటం వల్ల ఇంగ్లీషువాళ్ళ మీద అలగడమే తప్ప విశాల భారతదేశం గురించి ఆలోచించి ఆ యుధ్ధాలు చెయ్యలేదు.పూర్వకాలంలో మౌర్యులూ గుప్తులూ కూడా చెయ్యలేనిది ఇంగ్లీషు వాళ్ళు దేశం మొత్తాన్ని బ్రిటిష్ ఇండియాగా మార్చడంతో సాధ్యపడింది! క్రైస్తవ మిషనరీలు తమ మతానికి వూపు తెచ్చుకోవడానికి పైస్థాయిలో అప్రతిహతంగా సాగిపోతున్న బ్రాహ్మణ-క్రైస్తవ వర్గాల మైత్రిని తెగగొట్టితే అది భారతీయులలో జాతీయత రగుల్కొనడానికి దారితీసి సుదీర్ఘకాలపు పరాధీనతని వదిలించుకోవడానికి సహాయపడింది.తీరా దేశం పరాధీనతని వదిలించుకుని ప్రజలంతా ఒక్కతాటిమీద ప్రగతి కోసం పరుగులు పెట్టాల్సిన వేళ క్రైస్తవ మిషనరీలు బ్రాహ్మణుల సాయంతో వ్యాపించలేకపోవడంతో కిందికులాల్లో వ్యాపించడానికి పుట్టించిన బ్రాహ్మణ వ్యతిరేకత కులస్పృహని పెంచి జనం మానసికంగా విడిపోవటానికి కారణమైంది.యే ఒక్క క్షణంలో నైనా  మనముందు వేనవేల దారులున్నా సారూప్యవిభేదాలన్నిటినీ చూసుకుని ఆలోచిస్తే ఒకసారికి ఒకదారిలోనే వెళ్ళగలం గనక యేదో ఒక్కదారినే యెన్నుకోవాల్సి ఉంటుంది.ఒక ప్రాంతంలో ఒక తరంలో అనేక రకాలైన భావాలు గల వ్యక్తులు ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలోని అత్యధికులు దేన్ని పాటిస్తారో అదే ఆ సమాజపు సంస్కృతీ లక్షణం అవుతుంది - పదుగురాడు మాట పాడియై ధర జెల్లు నన్నట్టు!ఆ పాతకాలం శ్శ్రోత్రియ బ్రాహ్మణుదైన యేనుగుల వీరాస్వామాయ్య గారికున్న వివేకం కూడా లేకపోయిందేమిటి ఈ నూత్నకాలం సామాజిక శాస్త్రవేత్త అయిన కంచె ఐలయ్య గారికి?

         ప్రతి మతంలోనూ తాము చెప్పిన వాట్ని హేతువు కోసం వెదక్కుండా నమ్మితీరాలనీ అలా నమ్మకపోతే మతం నుంచి బహిష్కరిస్తామనే బెదిరింపులతో కూడిన పెత్తందారీ ధోరణి ఉండగా తన కిష్టమైన కొన్ని మతాలని ప్రజాస్వామికమైనవని పొగడుతూ తనకిష్టం లేని మతాల్ని చిన్నబుచ్చుతూ తీర్పులు తీర్చే ఈ అహంభావికి తన మతగ్రంధంలోనే యేనాడో ఒక వ్యక్తి గడ్డిపెట్టాడు, బహుశా బైబిలు కూడా పూర్వాపరాలు సరిచూసుకుంటూ చదివే అలవాటు లేకపోవటం వల్ల తెలిసి ఉండదు:

ఇతరులను నేరముల గురించి తీర్పును లిఖించు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవును నేరస్థుడవేనని తీర్పు తీర్చుకొనుచున్నావు.ఏలయనగా తీర్పు తీర్చుచున్న నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు గనక.అట్టి కార్యములను చేయువారిమీద దేవుని తీర్పు శుధ్ధసత్యము ననుసరించి బయల్పడునని తెలిసికొనుము.అట్టి కార్యములు చేయుచున్నవారికి తీర్పు  నిచ్చుచు వాటినే చేయు నీవు దేవుని తీర్పు తప్పించుకొనగలనని అనుకొందువా?

నీ కాఠిన్యమును, మార్పు పొందని హృదయముననుసరించి ఉగ్రత దినమునందు  - అనగా దేవుని న్యాయమైన తీర్పు బయల్పరచబడు దినమునందు - నీకు నీవే భయంకరమైన శిక్షను విధించుకొనుచున్నావు.నీవు మందుగా ఊహించలేని ఆ దినము నీ జీవితమునందే ఏ క్షనము నందైనను తటస్థించవచ్చును.

ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము నిచ్చును.సత్ క్రియను శ్రధ్ధతో చేయుచు,మహిమను,ఘనతను,అక్షయతను వెదుకువానికి నిత్యజీవమును దయచేయును.సత్యమునకు లోబడక దుర్నీతి ననుసరించువాని మీదికి దేవునిఉగ్రత తప్పక వచ్చును.పరమపితకు పక్షపాతము లేద్.ఆయనను మోసగించుట నీకు శక్యము కాదు.                                                               
 రోమా 2:1-11
JUDGE NOT OTHERS,JUDGE YOURSELF!

2 comments:

  1. ముందుగా ఒక _/\_ ...
    అయినా ఈ కంచె తన మతం చెప్పుకోడు కులం ముసుగు లో హిందుత్వం పై దాడి చేస్తాడు.

    ఇంత పే ...ద్ద వ్యసాలు ఎలా రాస్తారండీ!! అలా ధారగా చదువుతూ పోత్ర అయిపోయాక స్క్రోల్ చేసినప్పుడు తెలుస్తుంది పొడవైన వ్యాసం అని!
    (ముఖపుస్తకం లో లింక్ కాపీ పేస్ట్ చేస్తున్నా :) )

    ReplyDelete
  2. విషయం ఒకదానికి పది విషయాలు చెప్పుకుంటూ వస్తే తప్ప అర్ధం కానిది కావటంతో అట్లా పొడుగవుతుంది.అందులోనూ ఈయనగారి గందరగోలపు భావజాలాన్ని విడమర్చి చెప్పటం ఇంకా కస్టం.

    ముఖపుస్తకంలో లింకు ఇస్తానన్నందుకు సంతోషం.ఇంకో పేరాగ్రాఫు మిస్సయినట్టు అనిపిస్తుంది,అది కూడా కలిపితే విషయం కంప్లీట్ అవుతుందని అనిపిస్తుంది.రాత్రికి అప్డేట్ చెయ్యాలి.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...