Wednesday 31 December 2014

హిందూ ధర్మ ప్రహేళికలు - రామకధా వైభవం!

     రామాయణం యెందుకు చదవాలి?రామాయణం యెవరు చదవాలి?రామాయణం యెవరు చదవకూడదు?రామాయణం చదవకపోతే నష్టమేమైనా వుందా?రామాయణం కొందరికి కల్పవృక్షం లాగానూ కొందరికి విషవృక్షం లాగానూ కనబడటానికి కారణ మేమిటి?ఈ ప్రశ్నలకి వరసగా వెనక నుంచి ముందుకు జవాబులు చెప్తాను!

     జంబూద్వీపే భరత వర్షే అని బ్రాహ్మణులు వుభయ సంధ్యల్లో సంకల్పం చెప్పుకుంటూ ఇవ్వాళ్టి ఆఫ్ఘనిస్థాన్ వరకూ విస్తరించిన ప్రాచీనకాలం నుంచీ ఇక్కడ అధిక సంఖ్యాకులైన ప్రజలు పాటిస్తున్న సనాతన సాంప్రదాయాన్ని విదేశీయులు ఈ భూభాగాన్ని హింద్ అని పేరుపెట్టి గుర్తించాక దానినే ఆ సాంప్రదాయానికీ కూడా తగిలించి హిందూ మతం అని పేరు పెట్టారు!కానీ నా దృష్టిలో దీన్ని మతం అని పిలవటం తప్పు. ధర్మం అని పిలవడమే సరయినది! యెందుకంటే ఇది కాక ఇవ్వాళ మతాలుగా గుర్తించబడిన వాటికి ఒకే ప్రధాన దైవం,ఒకే పవిత్ర గ్రంధం,ఒకే సూత్రధారి అనే మూడు ఖచ్చితమయిన విభాగాలు వున్నాయి.పాటించవలసిన విధి నిషేధాల కయితే అవి ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే అనే ఒత్తిడీ,,పాటించకపోతే మతం నుంచి బహిష్కరించే పెత్తనమూ కేంద్రీకృతమయిన మతాధికార్లకి కట్టబెట్టబడి వుంది! 

     కానీ ఇక్కడ అలాంటివి లేవు. గ్రామ దేవతలతో సహా యెవరు యెవర్ని యెంచుకున్నా ఆ దైవమే ప్రధాన దైవం భక్తులకి!వేదాలూ, వుపనిషత్తులూ,అష్టాదశ పురాణాలూ - ఇవన్నీ కూడా వేటికవే సమానమయిన పవిత్రత కలిగినవే!ధర్మగ్లాని సంభవించినప్పుడు దైవసంకల్పంతో ప్రభవించిన అవతారపురుషు లంతా యెవరికి వారు సొంత వ్యక్తిత్వం కలిగి వుండి కూడా సమానంగానే పూజనీయు లయ్యారు! అలా అవతరించిన వారు కూడా ప్రజలకి ధర్మబధ్ధంగా బతకడం యెలాగే నేర్పటం కోసం తాము కూడా ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చి వాటిని తాము ఆచరించి చూపించి వుదాహరణగా నిలిచారు!ఋషి పరంపర అనేది ఒకటి వున్నా ప్రజల్ని ఐచ్చికంగా పాటించేలా చెయ్యడమే తప్ప బలవంతంగా పైనుంచి రుద్దకుండా వుండటం వల్ల్ల ధార్మిక వికేంద్రీకరణ అనేది సహజసిధ్ధమై కుదిరింది!దీనికి సాక్ష్యంగా సాయిబాబా గురించి ఒక పీఠాధిపతి నిషేధాజ్ఞలు జారీ చేసినా సాయిబాబా భక్తులు యే మాత్రమూ సందేహించకుండా వాట్ని బేఖాతరు చేసిపారేసి ధైర్యంగా తమ నమ్మకానికే నిలబడటాన్ని చెప్పుకోవచ్చు!ఇంత ప్రజాస్వామికమైన పధ్ధతిని మరో మతంలో చూడగలమా?కానీ ఇంత ప్రజాస్వామ్య బధ్ధమయిన సాంప్రదాయంలో కూడా ఒక రెంటికి మాత్రం వాటి విశిష్థతని బట్టి మోనాపలీ వచ్చేసింది!ఒకటి అన్ని పవిత్ర గ్రంధాల సారాన్నీ సంకలించిన భగవద్గీత,రెండు అన్ని ధర్మాలనీ ఒకచోట గుదిగుచ్చి ఒక కధలో ఇమిడ్చిన రామాయణం.హిందూ ధర్మాన్ని పాటించేవాళ్లలో ఈ రెంటి పట్లా వున్న ఆప్యాయతని బద్దలు కొట్టకుండా వారి భావజాలాన్ని వ్యాపింపజేయలేము అని రూఢిగా తెలుసుకుని యెలాగయినా సరే ఇక్కడ వ్యాపించాలనే మూర్ఖత్వం యెక్కువగా వున్నవాళ్ళకి గీత హింసని ప్రబోధిస్తున్నట్తు వినబడుతుంది,రామాయణం విషవృక్షం లాగా కనబడుతుంది.

     చాలాకాలం క్రితం "అంతరార్ధ రామాయణం" అని ఒక పుస్తకాన్ని కొంచెం తిరగేసాను!బెజవాడ లయోలా కాలెజిలో చదివేటప్పుడు బీసెంటు రోడ్డు దరిదాపులకి వస్తే తీరిక అంటూ వుంటే పుస్తకాల షాపుల్ని చుట్టడం, మంచి పుస్తకం కనబడినట్టాయెనా సరిపడా దబ్బులుంటే అప్పుడే కొనెయ్యడం - లేదంటే ఇరవై నాలుగ్గంటల్లో మళ్ళీ పైకంతో సహా తిరిగొచ్చి అప్పుడు కొనడం చేసేవాణ్ణి!ఈ పుస్తకం మాత్రం యెందుకో నచ్చాక గూడా నాచేతికి రాకుండా తప్పించేసుకుంది!అయినా రుచి చూసేటప్పుడే చాలామటుకు లాగించేశాను యెందుకయినా మంచిదని!రాసింది మన తెలుగాయనే,వేదుల సూర్యనారాయణ శర్మ గారనుకుంటాను!రామాయణానికే గాదు,భారతానికీ,భాగవతానికీ గూడా అంతరార్ధాన్ని విప్పిచెప్పారు గానీ నేను రామాయణం గురించి మాత్రమే చదివాను!

     ఇవ్వాళ మిలిటరీ వాళ్ళు రహస్య సందేశాల్ని వాళ్ళు యెవరికి తెలియజెప్పాలో వాళ్లకి తప్ప మిగిలిన వాళ్ళకి అర్ధం కాని ఒక కోడ్ లాంగ్వేజిని వాడుకుని పంపించటం అనే పధ్ధతి ఫాలో అయినట్టు పాత్రలకి పెట్టిన పేర్లని విడగొట్టీ ,వుపకధల సన్నివేశ కల్పనలో మూలకధకున్న ప్రాధాన్యతని కనిపెట్టీ పైకి కనిపించని మరో కధ దాగి వున్నట్టు నిరూపించారు!"అయోధ్యా నగరానికి రాజు దశరధుదు" అంటే మన మనస్సులోని చపల స్వభావం గురించి చెప్తున్నట్టు లెక్క!యెలా అంటే, యోధులకి జయించ శక్యం కానిది అని కదా అర్ధం - మనల్ని మనమె నాశనం చేసుకోవాలి తప్ప ఇతరులెవరూ మనని నాశనం చెయ్యలేరు కదా!మన మనస్సుని కూడా మనం మచ్చిక చేసుకోగలమే కానీ గెలవలేం కదా!ఇక దశరధ అనే మాటకి పదివైపులకీ పరిగెత్తగలిగిన రధాలు అని అర్ధం,చపలత్వానికి పర్యాయ పదం!కౌసల్య,కైకేయి,సుమిత్రలకి గూడా ఇలాగే వున్నాయి గానీ రాముడు అంటే రమింపజేయువాడు అని అర్ధం.సీత అనే పదానికి ఆయన చెప్పింది నాకు గుర్తు లేకపోవతంతో సొంతంగా పరిశ్రమిస్తే "అసీద్" అనగా "యేదయితే వున్నదో అది" అనే "బ్రహ్మసత్యం జగన్మిధ్య" అనే మంత్రార్ధం కనబడింది!ఇప్పుడు మనం రాముణ్ణి అధికుడిగా నిలబెట్టాడనీ సీతని అతని భార్యగా నిలబెట్టి రెండో స్థానం ఇచ్చాడనీ అనుకునే దానికి పూర్తి విరుధ్ధం.సీతయే ఆరాధనీయమయిన దైవశక్తి కాగా రాముడు దైవ్వసాన్నిధ్యం కోరుకునే సాధకు డవుతాడు!మిగతా కధలో వచ్చే సన్నివేశాల్ని ఆ పధ్ధతిలోనే వర్ణించి ఆయన కూడా నా వూహనే సమర్ధిస్తున్నారు?శివ ధనుర్భంగం అనేది సాధకుడి ఓంకార సాధన ఫలితమిచ్చి తొలిసారిగా దైవ సంశ్లేషణం జరగటానికి గుర్తు!శివ ధనువు విరిగినప్పటి భీబత్సపు వర్ణనలన్నీ అప్పుడు యోగిలో కలిగే అలజడిని వర్ణించే మార్మిక విషయాలతో నిండి వుంటాయి!

     అలా మొదటిసారి దైవసంస్పర్శన సుఖాన్ని అనుభవించి కూడా కైక పాత్ర పరంగా చెప్పబడిన దుర్గుణం సాదకుణ్ణి భయంకరమయిన రాక్షస ప్రవృత్తులతో నిండిన ప్రకృతి శక్తుల మధ్యకి విసిరేస్తే పంచేంద్రియాలు పంచవికారాలతో కలిసి రావణం చేస్తూ వచ్చి అతన్ని దైవానురక్తి నుంచి దూరం చేస్తాయి!ఒకసారి సాధించి కోల్పోయిన దాన్ని తిరిగి మరింత గట్టిగా సాధించాలంటే ఇప్పుదు అతనికి ఒక సద్గురువు చాలా అవసరం!ఆ స్థానంలో హనుమంతుల వారు వస్తాడు?ఆ పాత్ర కధలో ప్రవేశించడమే "మా భయ మా సంవిక్త" అనే మహావాక్యంతో ప్రవేశిస్తుంది!గురువు శిష్యుడికి చేసే సహాయం కూడా అదే - భయాన్నీ ఆందోళననీ వదలగొట్టి సరయిన దారిలో నడిపించటం! కధలో కూడా హనుమంతుడు ప్రవేశించేవరకూ రాముడే ఇవ్వాళ్టి సినిమాల్లో వున్నట్టు డైనమిక్ హీరోలా వుంటాడు,కానీ ఒకసారి హనుమంతుడు ప్రవెశించాక కధలోని ప్రతి సన్నివేశంలోనూ హనుమంతుడే ప్రధానంగా కనపడి వ్యవహారాన్ని చక్కబెదతాడు!అది కూడా అతని ఆచార్యత్వాన్ని నిర్ధారించే విషయమే!

    సీతా సందర్శనం చేసి రాగానే నేను నీకు ఇవ్వగలిగింది ఇదే అని రాముదు హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు.అది మామూలు కౌగిలి కాదు, శిష్యుడు గురువుతో అభేధస్థితిని సాధించటానికి చిహ్నం!యుధ్ధం ముగిశాక సీత అగ్నిప్రవేశ ఘట్టం మరో అధ్బుత సన్నివేశాన్ని ఆవిష్కరిస్తుంది!ఈ సకల చరాచర జగత్తునీ శాసించగలిగిన వాడు తనని మోహానికి గురి చేసి అనాధలా వొదిలెయ్యటం పట్ల అతని ఆక్రోశాన్ని వ్యక్తీకరించటం,ఆ అవేశంలో దైవాన్ని కూడా అధిక్షేపించడం అనే చిత్రమయిన దృశ్యం కనబడుతుంది!రామదాసు "యెవడబ్బ సొమ్మని కులుకుతు తిరిగేవు" అని గద్దించి మళ్ళీ "అబ్బా, దెబ్బల బాధ కోర్వలేక తిట్టితినయ్యా" అన్నప్పుడూ అన్నమయ్య బ్రహ్మాండ నాయకుణ్ణి చిన్న పిల్లాణ్ణి చేసి జోలపాటలు పాడినప్పుడూ వాళ్ళు అంత గట్టిగా దైవం మీద అధికారం సాధించి యెలాంటి మానసిక స్థితిలో వున్నారో సీత అగ్నిప్రవేశం జరిగిన సన్నివేశంలో రాముడి మనస్థితి కూడా అలాగే వుంటుంది! 

     అంటే ఇది ఒక రాజుగారబ్బాయి కధ కాదు,మన మనస్సులో నిత్యం జరిగే "యేది పాపం?యేది పుణ్యం" అనే సంఘర్షణకి ప్రతిరూపం అన్నమాట!సామాన్యత్వం నుంచి అసామాన్యత్వానికి ప్రయాణం చేసిన ప్రతి వ్యక్తీ అంతరంగంలో ఈ సన్నివేశాల మీదుగానే ప్రయాణిస్తాడు,ఈ అనుభూతుల నన్నిట్నీ అనుభవించి తీరుతాడు!అందుకే వాల్మీకి అవతారికలో అంత ధీమాగా "ఈ ప్రపంచంలో పర్వతాలు స్థిరంగా వున్నంత వరకూ నదులు ప్రవహిస్తున్నంత వరకూ నా రామకధ నిలిచి వుంటుంది" అని చెప్పుకోగలిగాడు?!అనునిత్యం మనలో జరిగే కధని మనం తెలుసుకోకపోతే నష్టం యెవరికి - మనకే!

   జవహర్ లాల్ నెహ్రూ గొప్పవాడు,మంచివాడు అనే భావం వున్నవాళ్ళలో యెవరూ రామాయణాన్ని చదవకూడదు.దానివల్ల వాళ్ల మనోభావాలు దెబ్బతిని అశాంతికి గురయి వాళ్ళ మానసికారోగ్యం చెడుతుంది!తండాల సంస్కృతిలో పెరిగి మూకుమ్మడి దొమ్మీల లాంటి కిరాతక యుధ్ధాల్తో మునిగితేలిన చెంగిజ్ ఖాన్ మరియూ తైమూరు లంగ్ అనే క్రూరుల్లో ఆ గాంధీగారి ప్రధమ శిష్యుడికి గొప్ప నాయకత్వ లక్షణాలు కనపడ్దాయి,బహుశా రక్త సంబంధం యేదయినా వుందేమో!వాళ్ళని పొగడటానికి యెన్నో విశేషణాల్ని వాడాడు.కానీ రాముణ్ణి గురించి పొగిడినట్టు లేదు?జిజియా పన్నులు వేసిన ఔరంగజేబు కాలం లోనే తన రాజ్యంలో హిందూ ముస్లిముల్ని సమానంగా చూసిన శివాజీ మహరాజ్ అతనికి గొప్ప నాయకత్వ లక్షణాలు వున్నవాడిగా కనపడ లేదు,పొగడటానికి చాలా ఇబ్బంది పడిపోయాడు,యెందుకనో!కాబట్టి వారు ఈరోజున లేకపోయినా వారి మానసపుత్రులు వున్నారు గనక వారికి నేను చేస్తున్న విజ్ఞప్తి - "అయ్యా!తమరు దయ వుంచి రామాయణం చదవకండి!చదివినా వెంఠనే మర్చిపొండి!మీకు తోచిన పిచ్చి అర్ధాలు వెతికి మమ్మల్ని కూడా మీలాగ తయారు చేసి వుధ్ధరించుదామని అస్సలు ప్రయత్నించకండి!మేము మా ఆత్మారాముడితో అనుబంధాన్ని వొదులుకుని ప్రేతాత్మల్లాగ బతకడానికి సిధ్ధంగా లేం!"

    లాభం వస్తుందని రూఢిగా తెలిసినప్పుడు మంచిపనులు చేస్తూ నష్టం వస్తుందని అనుమానం రాగానే దొంగపనులకి దిగుతూ అవకాశవాదిగా బతకాలనుకోకుండా నష్టం వచ్చేటప్పుదు వెనక్కి తగ్గుతూ మంచిపనులు మాత్రమే చెయ్యాలనుకునేవాళ్ళు అందుకు వుత్తేజితులు కావడం కోసం రామాయణం తప్పనిసరిగా చదవాలి!యెడ్వినా పట్ల వ్యామోహంతో అభాసు పాలయిన జవహర్ లాల్ నెహ్రూ లాగా కాకుండా మరోలాగ బతకాలనుకునేవాళ్ళకి రామాయణం వుత్సాహాన్ని ఇస్తుంది.రాముడే స్వయంగా చెప్పినట్టు "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ" అనే భావం ప్రకారం ఈ దేశాన్ని మాతృదేశంగా భావించేవాళ్ళు కులమతప్రాంతాలతో సంబంధం లేకుండా రామాయణాన్ని చదవాలి?!

     ఇక్కడితో రామకధా వైభవం పూర్తయింది!మొదట ఇంత విస్తారంగా ఇదంతా చెబుదామనుకోలేదు.చిన్న ప్రస్తావనతో సరిపెట్టి అసలు కధలో వుండే ప్రహేళికలనే తిన్నగా యెత్తుకుందామనుకున్నాను,తీరా మొదలు పెట్టాక అనుకోకుండా ఇంతగా విస్తరించింది?అయినా ఇవన్నీ తెలిస్తేనే కధలోపలి విశేషాలు మరింత చక్కగా అర్ధమవుతాయి లెండి!కానీ ఇక్కడే అవి కూడా చెబితే పోష్టు చాలా పెద్దదయ్యేలా వుంది,కనుక "హిందూ ధర్మ ప్రహేళికలు-రామకధా విశ్లేషణం" అనే తరవాతి భాగం కోసం మీరు కొంచెం వేచివుండాలి!
_______________________________________________________________
చారిత్రక విషాదం   రామకధా వైభవం రామకధా విశ్లేషణం రామకధా విమర్శనం  రామకధా విజృంభణం

6 comments:

  1. భేష్! మీ తపన చూస్తే ముచ్చట వేస్తుంది!
    రామాయణం ఓ అన్యార్ధ కధ అంటారు..! బైబిల్ గురించీ ఖురాన్ గురించీ కూడా ఇలాంటి వ్యాఖ్యానాలు చలామణి లో ఉన్నాయి. ఈ వ్యాఖ్యానాలు అసలు రచయిత మది లో ఉన్నవయితే మన సంస్కృతి నిజం గా గొప్పదని అంగీకరించక తప్పదు! మధ్య లో వేరే వారు సమర్ధించటం కోసం రాసిన భాష్యాలయితే చిక్కే.
    మీరు మీకున్న నమ్మకం వలన ఈ గ్రంధాలను అధ్యయనం చేస్తున్నారా? లేక మీ అధ్యయనం వలన నమ్మకం పెరిగిందా లేక రెండూనా?
    భారతం లోకూడా ఇలాటి లోతైన ఆధ్యాత్మిక అర్ధాలు ఉన్నాయా (పైకి మామూలు కధైనా, లోతు గా చూస్తే, నిగూఢమైన, అర్ధం ఉండటం)..

    ReplyDelete
    Replies
    1. నేను మొదట్లో నాస్తికుణ్ణి!తర్వాత ఆస్తికుడిగా మారినా హేతువుని వదల్లేదు.మొదటిసారి చదివేటప్పుదు యేముందో తెలుసుకోవాలనే కుతూహలం తోన చదివాను తప్ప ముందే నమ్మడానికి నిశ్చయించుకునే మూఢత్వం నాకు లేదు.

      వాల్మీకి లెక్క ప్రకారమే రాశాడు రామాయణాన్ని.రాముడికి గానీ,హనుమంతుడికి గానీ,సీతకి గానేఎ వాడిన ప్రతి విసేషణానికీ నిరూపణ కోసం ఒక సన్నివేశాన్ని కల్పించాడు.ఈ విశ్లేషణ యెవరు చేశారో చెప్తే మీకు షాకు తగలొచ్చు?చాగంటి వారో మద్దాలి వారో కాదు, ఆంధ్రజోతి వీక్లీ ఆగిపోయే ముందు ఒక కమ్యునిస్ష్టు మేధావి రామాయణం గురించిన ధారావాహికలో చెప్పింది!ముప్పాళ్ళ రంగనాయకమ్మ విషవృక్షం రాసిన కొన్ని దశాబ్దాల తర్వాత ఒక కమ్యునిష్తు మేధావి పౌరాణికులు కూడా చెప్పని విశేషాలతో రామాయణం గౌరవాన్ని పెంచే విధంగా వ్యాఖ్యానించాడు,దానర్ధం యేమిటో వూహించగలరా?!

      విశ్లేషణంలో కూడా మొదట్లో ఇలాంటివి చెప్పాకే కధలోకి వెళ్తాను.తెలుగులో వచ్చిన అనువాదాలలో వుషశ్రీ గారిదే మూలానికి దగ్గిరగా వుంటుంది.పైన చెప్పిన కమ్యునిష్టు మేధావి విశ్లేషణ కూడా వుషశ్రీ వెర్షనుకి దగ్గిరగా వుంది.నేను అదే ఫాలో అవుతున్నాను.

      Delete
  2. రామాయణం గురించి ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. రామాయణం ఒక మహా కావ్య నిధి. వెతుక్కున్న వాళ్ళకి ఏది కావాలంటే అది దొరుకుతుండి. విలువయిన మణులూ, రత్నాలు దొరికినా అవన్నీ రంగురాళ్ళని వాదించే వాళ్ళతో మనం ఏమి మాట్లాడగలం? వాటి విలువ తెలిసిన వాళ్ళకి అది ఒక అపురూప నిధి.

    ReplyDelete
  3. How movies embraced Hinduism (without you even noticing)

    From Interstellar to Batman and Star Wars the venerable religion has been the driving philosophy behind many hit movies. Why?

    http://www.theguardian.com/film/2014/dec/25/movies-embraced-hinduism?CMP=share_btn_tw

    ReplyDelete
  4. మీరు రామాయణాన్ని ఒక కథగా మొదట్లో చెప్పి, ఆఖర్లో ఆ ఆత్మారాముడు, ఆనందం ఎంటో నాకర్ధం కాలేదు. ఇంతకీ మీరు రామాయణాన్ని కథ అంటారా? నిజంగా జరిగింది అంటారా?

    ReplyDelete
    Replies
    1. మీకది అర్ధం కాదు లెండి?
      చెప్పడం కూడా వేస్టు,శుభం!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...