Thursday 13 March 2014

ఇక ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణానికి ఒక నూతన రాజకీయ ఆర్ధిక వ్యవస్థ కావాలి - 5

                    విభజన యెంత ఘోరంగా చేసింది ఆ క్రూరమయిన కాంగ్రెసు పార్టీ. విభజన ఫలితాల్ని రేపటి రోజున అనుభవించాల్సీన రెండు వర్గాల్లో యెవరి మాటా వినకుండా ఈ రోజున దక్షిణాది రాష్ట్రాల్లో కల్లా పరువయిన బరువయిన ఒక రాష్ట్రాన్ని - విభజన బిల్లులో విడిపోయిన తర్వాత పునర్నిర్మాణానికి అవసరమయిన నిధుల కేటాయింపు లేకుండా. పయిగా తను యేదో ఘనకార్యం చేసినట్టుగా దీన్ని చూపెట్టి వోట్లూ సీట్లూ ఇమ్మని అడగటానికి సాహసిస్తున్నదంటే తెలుగు వాళ్ళ మెదడు తక్కువ తనం మీద యెంత చిన్న చూపో కదా!

                   ఒకానొకప్పుడు విభజన జరగక మునుపు హైదరాబాదు గురించి అక్కడ ఆంధ్రా పెట్టుబడుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఒక వ్యక్తి, "బంజారా హిల్స్ లో 90% మంది సీమాంధ్రులు, పక్కనే స్లంస్ లో 90% మంది తెలంగాణా వాళ్ళు - ఇదేనా నువ్వు చెప్పే అభివృధ్ధి?" అని ఆవేశ పడిపోయారు? ఉద్యమ కాలం లోని ఆ ఆవేశం ఇప్పుడు పనికొస్తుందా?రాష్ట్రం యేర్పడగానే ఆ స్లంస్ అన్నీ మాయం చేసి వారిని ఉధ్ధరించి చూపగలమనే నమ్మకం ఉందా?నాకు లేదు!యెందుకంటే హైదరాబాదు తనొక్కటే ద్వీపకల్పంగా లేదు. అది ఒక రాష్ట్రంలో భాగం. ఇవ్వాల్టి రాజకీయ ఆర్ధిక విధానం అందుకు వెసులుబాటు నివ్వదు.ప్రతీ నగరాన్నుంచీ, ప్రాంతాన్నుంచీ రెవెన్యూ నంతా పోగు చెయ్యటం, కేంద్రం వరకూ పంపించటం చేసి మళ్ళీ కేంద్రం నుంచి ఇక్కడి వరకూ రెవెన్యూ తిరిగి వచ్చినప్పుడు  మాత్రమే ఆ ప్రాంతం అభివృధ్ధికి నోచుకుంటుంది.యెన్ని ఉదాహరణలు కావాలి? ఒక ప్రాంతం లో కొన్ని కోట్ల ఆదాయాన్ని తీసుకొచ్చే పరిశ్రమ ఉంటుంది. పక్కనే ఉన్న గ్రామాల్లో తాగునీటికే సమస్య!


            అందుకే నేను జిల్లాల స్థాయిలో తమ రెవెన్యూని తామే ఇక్కదే ఖర్చు చేసుకోగలిగే పూర్తి అధికారాలతో కూడిన ప్రాంతీయ ప్రభుత్వాలు యేర్పడటం గురించి పట్టుబడుతున్నది. ఇది నేను కొత్తగా చేస్తున్న ప్రతిపాదన కూడా కాదు. ఇప్పటికే పయిన నేను చెప్పిన విషయాలను పరిశీలించిన మేధావులు చాలా కాలం క్రితమే ఈ రెవెన్యూ పరమయిన స్వయంపాలన గురించి ప్రస్తావించి ఇదే పరిష్కారాన్ని సూచించారు.ఇప్పుడూ ఇకముందూ ఈ రాష్ట్రం నికరమయిన అభివృధ్ధిని జమ చేయాలంటే పూర్తి అధికార వికేంద్రీకరణ తప్పనిసరి.


                  ఈ వ్యాస పరంపరలో మోడో భాగంలో నేను భారత్ పూర్తి స్థాయిలో అగ్రరాజ్యంగా యెదగటానికి నాలుగు వీషయాల గురించి ప్రస్తావించాను.అవి:మొదటిది అధికార వికేంద్రీకరణ, రెండోది విద్యని మార్కెట్ కి అనుసంధానించటం, మూడవది వ్యవసాయాన్ని వ్యవస్థీకరించి లాభసాటిగా తీర్చిదిద్దటం,నాలుగోది మన సంస్కృతి మూలాల్ని పరాయీకరణకి గురి కాకుండా రక్షించుకోవటం.


             విద్యని మార్కెట్కి అనుసంధానించటం అనేది చాలా అవసరంగా జరగాల్సీన పని. మార్కెట్లో ఆల్రెడీ అడుగు పెట్టినా వెళ్ళాల్సినంతగా ముందుకు వెళ్ళలెక పోవటానికి మానవ వనరులే కారనమని మార్కెట్ విశ్లేషకులు యెన్నోసార్లు విశ్లేషించినా ఇంతవరకూ సమస్య యెవరికీ అర్ధం కావడమే లేదు. మార్కెట్ కి ఇవ్వాళ కావలసిన మానవ వనరులు గొడ్డు పని చేసే రోజు కూలీలు కాదు మార్కెట్ లో మన వాటాని పెంచగలిగే తెలివయిన కుర్రాళ్ళు! ఇవ్వాల్టి డిగ్రీ లన్నె ఉద్యోగాలకు మాత్రమే పనికొస్తాయి. మార్కెట్ సక్తులకి తలుపులు బార్లా తెరిచి పదేళ్ళయినా ఆ వైపులి అసలు చూపునే మళ్ళించడం లేదెవరూ.దానికి పై స్థాయిలో R&D చాలా జరగాలి. విద్యా వ్యవస్థలో సమూలమయిన మార్పులు తీసుకు రావాలి.


     వ్యవసాయాన్ని వ్యవస్థీకరించి లాభసాటిగా మార్చడం గురించి కొంచెం విడమర్చి చెప్తాను.వ్యవసాయానికి ఇవ్వాళ ఇస్తున్న ప్రోత్సాహకాలూ, విత్తనాల సరఫరాలూ, వ్యవసాయ ఋణాలు మాఫీ చెయ్యటం లాంటివన్నీ కేవలం తాత్కాలిక సర్దుబాట్లు మాత్రమే తప్ప దీర్ఘకాలికంగా ప్రయోజనాన్నిచ్చేవి కావు. అసలు వ్యాపారం కానీ పరిశ్రమలు కానీ వ్యవసాయం కన్నా యెందుకు లాభసాటిగా ఉన్నాయనుకుంటున్నారు మీరు?పెట్టుబడి, వనరుల్ని ఉపయోగించుకోవటం, తయారయిన సరుకుని మార్కెట్ కి తీసుకెళ్ళడం - వీలయితే మార్కెట్ని తనకనువుగా నడిపించుకుని అయినా లాభం తెచ్చుకోవడానికి ఒక వ్యవస్థ సపోర్ట్ గా ఉంది. వ్యవసాయం ఇన్ని ప్రోత్సాహకాలతోనూ దైవాధీనం మోటర్ సర్వీస్ లాగా నడుస్తున్నదే తప్ప వ్యవస్థీకృతం కాలేదు. వ్యవస్థీకృతం చెయ్యకుండా లాభసాటిగా తీర్చి దిద్దలేం!



                        వ్యవసాయానికి ముఖ్యమయిన అవసరాలు ప్రకృతిసిధ్ధమయినవి - గాలి, నీరు, వేడి.వీటిలో గాలినీ వేడినీ అస్సలు కంట్రోల్ చెయ్యలేం. నీటిని చెయ్యగలం. కానీ ఇవ్వాళ దేశమంతా వ్యవసాయం నదీ జలాల మీద ఆధార పడి నడుస్తున్నది.మనకున్న నదుల్ల్లో చాలా మటుకు వర్షాధారమయినవే. హిమానీ నదాలూ, జీవనదులూ కూడా దిగువకి వెళ్ళి సముద్రాన్ని చేరే లోపు బలహీన పడుతున్నవే.వీటికి అతివృష్టి, అనావృష్టి లాంటి వాటితో పాటు అంతర్రాష్ట్ర జల వివాదాలు కూడా తోడయి జల వనరుల పంపిణీ విధానం చాలా అస్తవ్యస్తంగా ఉంది.మొట్ట మొదటి సారిగా దీనికి ప్రత్యామ్నాయం చూపించింది మన తెలుగు వాడు - కె.యల్. రావు గారు. నదుల అనుసంధానం - వేసింది మాస్టర్ ప్లానే. ఆయన కేవలం ఆ కలని సాకారం చేసుకోవాలనే కాంగ్రెసులో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా పాల్గొన్నారు.కానీ మనం జాతీయ స్థాయిలో ఆ పేరు ప్రస్తావనకి రాగా విన్నది ఈ మధ్యనే వాజపేయి గారి ద్వారానే. మొదటి నుంచీ దాని గురించి తెలుసుకున్న మేధావు లంతా ఇప్పటికీ అది మంచి ప్లానే అంటున్నారు.


               కానీ అది మొత్తం ఒకే ప్రాజెక్ట్ కాదు. దేశం మొత్తం మీద యెన్నో చోట్ల చేపట్టి వీటన్నిట్నీ కలుపుకుంటూ రావలసిన అనేక ప్రాజెక్టుల సమాహారం. ఇప్పటి రెవెన్యూ ఫ్లో పధ్ధతిలో అంటే ప్రతీ రూపయీ పైనుంచే రావాలనే పధ్ధతిలో దశల వారీగా చెయ్యాలంటే మొదలు పెట్టిన తర్వాత దశాబ్దాలే కాదు శతాబ్దాలే పట్టవచ్చు.నేను చెప్పాది యేంటంటే - వాటిల్లో కల్లా అతి పెద్ద ప్రాజెక్టు పట్టే కాలాన్ని లిమిట్ గా పెట్టుకుని అన్నీ ఒకేసారి మొదలెట్టి ఆ నిర్ణీత కాలం లోపే అన్ని నిర్మాణాలూ ఒకేసారి పూర్తి చెయ్యగలగాలి.ఒక పోలిక చెప్తాను. చిత్రగ్రీవుడనే కపోత రాజు వలలో చిక్కుకుని దాన్నించి తప్పించుకోవడానికి చెప్పిన ఉపాయమేమిటి? పిట్టకధతో పోలిక తెచ్చినా నదుల అనుసంధానం అలా చేస్తే తప్ప ఇప్పటి పధ్ధతిలో అంచెలంచెల మోక్షము అనే పధ్ధతిలో మాత్రం యెప్పటికీ మోక్షణం రాదని నా అభిప్రాయం.అలా చెయ్యాలంటే ప్లాన్ లేఔట్ ని బట్టి యే ప్రాంతంలో ఆ ప్రాజెక్టు కు సంబంధించిన యే భాగం వస్తుందో అక్కడి కక్కడ జరగటం ద్వారా సమయం, ధనం పొదుపు అవుతాయి.అదీ యెప్పుడు? దేశంలో అన్ని చోట్లా ప్రాంతాలకి తమ రెవెన్యూని తమ వద్దనే ఉంచుకోగలిగిన స్వయం ప్రతిపత్తి ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది.

                 సాంస్కృతికంగా కూడా పరాయీకరణకి గురి కాకుండా కాపాడేది తన ప్రాంతం పట్ల మమకారం మాత్రమే.తన ప్రాంతం చరిత్ర యేమిటో తెలుసుకుని అందులో గర్వించదగిన విషయాల పట్ల ఉండే అభిమానమే అతన్ని ప్రత్యేకంగా తన ఉనికిని గుర్తుంచుకుని ఆ వారసత్వం పట్ల ఉండే ఉత్సాహం అనితర సాధ్యమయిన కార్యాల్ని చేసే విధంగా ప్రోత్సహిస్తుంది, తన ప్రత్యేకతని నిలబెట్తుకునే విధంగా తీర్చి దిద్దుతుంది.కానీ ఇప్పటికీ చరిత్ర అంటే యెక్కడో ఉన్న హరప్పా మొహంజదారో శిధిలాల గురించి తప్ప మన చుట్టూ ఉన్న వాట్నే గుర్తించ లేక పోతున్నాం.ప్రాంతీయ ప్రభుత్వాలు తమ అధికారంలో ఉన్న వనరుల్ని ఉపయోగించుకుని ఇప్పటీ కన్నా మరింతగా స్థానిక చరిత్రల్ని వెలికి తియ్యగలవు. వాటి వల్లనే జరుతుందనే మూర్ఖత్వం లేదు గానీ యెక్కడి స్థానిక చరిత్ర ఆ ప్రాంతాన్ని ఇష్టపడే అక్కడి వారి ఉత్సాహం వల్ల మరింతగా వెలుగు లోకి వస్తుంది. 



భరత వాక్యం:అన్ని రకాల రాజ్యాంగ నిబంధనలతో ఇప్పుడున్న దానికన్నా అధికార వికేంద్రీకరణ అనే లక్ష్యాన్ని సాధించుకోవటం తప్పని సరి. ఇదే మంచి మోడల్ అనే అభిప్రాయం లేదు. ఇప్పుడున్న నిర్మితి లోనే ఇవ్వాళ మనం ఆపలేని నిస్సహాయతతో తలవంచేసిన దరిద్రాలకి మూలం ఉంది. ఈ నిర్మాణాన్ని ఇలాగే ఉంచితే మళ్ళీ మళ్ళీ ఇలాంటి సమస్యలే తల యెత్తుతాయి కాబట్టి యెప్పటి కయినా అధికార వికేంద్రీకరణ అనేది తప్పదు.రాజకీయ పరమయిన వికేంద్రీకరణ కన్నా ఆర్ధిక పరమయిన వికేంద్రీకరణ చాలా ముఖ్యం.
-----------------------------------------------------------------------------------------------------------------
1 2 3 4 5

1 comment:

  1. నదుల అనుసంధానం జరిగేపని కాదు. ఒకవేళ జరిగినా లాభసాటి కాదు.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...